చిన్నారి పునర్వికకు ఇంజెక్షన్; నూరేళ్లు వర్ధిల్లు చిట్టి తల్లి
చిన్నారి పునర్విక చిరునవ్వులు మళ్లీ పూశాయి. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారి పునర్విక మృత్యువును జయించింది. తెలుగు రాష్ట్రాల ప్రజల ఉదారత, ప్రభుత్వం అందించిన సాయంతో.. అసాధ్యం సుసాధ్యమైంది. అరుదైన, అత్యంత ప్రమాదకరమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) వ్యాధితో మృత్యువు అంచుల్లో ఉన్న ఆ పాపను కాపాడుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఫలించింది. శనివారం ఉదయం హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో లోకేష్ సమక్షంలోనే వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన రూ. 16 కోట్ల ఖరీదైన 'జోల్ జెన్ స్మా' (Zolgensma) ఇంజెక్షన్ను చిన్నారికి విజయవంతంగా ఇచ్చారు.
ఎవరీ పునర్విక? ఏమిటా వ్యాధి?
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్, పుష్పావతిల గారాల పట్టి పునర్విక. పుట్టిన ఆరు నెలలకే ఆ పాప శరీరంలో కదలికలు తగ్గిపోయాయి. పరీక్షలు చేయిస్తే అది 'SMA టైప్-1' అని తేలింది. వెన్నెముక కండరాలు క్షీణించి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే ఈ వ్యాధికి చికిత్స ఒక్కటే.. అది రూ. 16 కోట్ల ఇంజెక్షన్. తండ్రి క్షవర వృత్తి కావడంతో అంత భారీ మొత్తం సమకూర్చడం అసాధ్యంగా మారింది.

'సేవ్ పునర్విక'.. వెల్లువెత్తిన మానవత్వం
సోషల్ మీడియా వేదికగా పునర్విక కథ వైరల్ కావడంతో లక్షలాది మంది దాతలు స్పందించారు. ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా సాయం చేయడంతో ఫిబ్రవరి నాటికి రూ. 10 కోట్లు సమకూరాయి. కానీ, ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి. పాప పరిస్థితి విషమిస్తుండటంతో తల్లిదండ్రులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేష్ను సాయం కోరారు.
Promise Kept.
— Lokesh Nara (@naralokesh) April 18, 2026
Punarvika's injection done today.
Live a 100 years Chitti Talli! pic.twitter.com/UnAxkAfChs
అన్నగా అండగా నిలిచిన లోకేష్..
"పునర్విక బాధ్యత నాది.. ఆ చిట్టితల్లిని కాపాడుకుందాం" అంటూ మంత్రి లోకేష్ తక్షణమే స్పందించారు. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా.. తక్కువైన రూ. 6 కోట్ల నిధులను తానే స్వయంగా సమీకరిస్తానని భరోసా ఇచ్చారు. అమెరికా నుంచి ఇంజెక్షన్ రప్పించేందుకు తన వ్యక్తిగత సిబ్బందిని రంగంలోకి దించారు. నోవార్టీస్ కంపెనీ, రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయకర్తగా ఉండి అన్ని అనుమతులను వేగవంతం చేశారు.
బోసినవ్వులు చిందిస్తూ..
నేడు ఆసుపత్రిలో ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో లోకేష్ దగ్గరుండి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స సమయంలో పాప ఏడుస్తుండటంతో స్వయంగా ఎత్తుకుని లాలించారు. లోకేష్ చేతుల్లో ఆ చిన్నారి చిందించిన బోసినవ్వులు చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. "మేము జన్మనిస్తే.. లోకేష్ బాబు మా పాపకు పునర్జన్మ ఇచ్చారు" అంటూ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు














Click it and Unblock the Notifications