జగన్, పవన్తో కలిసి బీజేపీనా?: చంద్రబాబుపై పురంధేశ్వరి, కన్నా ఆగ్రహం
హైదరాబాద్: దేశ సంక్షేమం కోసం అంత్యోదయ మూల సిద్దాంతంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోందని ఆ పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మహిళల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు.
Recommended Video
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి పక్కన వాళ్లను డబ్బులు అడిగేవారు.. కానీ ప్రస్తుతం మోడీ పాలనలో ఓడీ పేరిట 5 వేల రూపాయలు తీసుకునే అవకాశం కల్పించారన్నారు. అంతేగాకుండా సంపాదించుకున్న సొమ్ముకు జన్ధన్ ఖాతా ద్వారా భద్రత కల్పించారని తెలిపారు.
బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించింది
మహిళా ప్రసూతి మరణాలను దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని పురంధేశ్వరి తెలిపారు. 2014లో చాలా మంది బీజేపీ 120, 130,150, 170 స్థానాలు మాత్రమే గెలుచుకుంటారని జోస్యం చెప్పారని కానీ అనూహ్యమైన మెజారిటీ, విజయాన్ని సాధించి.. కేంద్రంలో అధికారం చేపట్టిందన్నారు. ప్రస్తుతం బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు.
బీజేపీలో ఆ సాంప్రదాయం లేదు
కాగా, దేశంలో మొత్తం 1700 పార్టీలు ఉండగా.. ప్రసుతం అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని పురందేశ్వరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విరమణ పొందిన వెంటనే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ, బీజేపీలో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. రేపటి రోజు మీలో ఎవరైనా దేశ అధ్యక్ష పదవి చేపట్టవచ్చంటూ పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇలా బీజేపీకి చెందిన చాలా మంది వ్యక్తులు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారేనంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
పవన్, జగన్.. అంటూ.. టీడీపీ తప్పుడు ప్రచారం
ఏపీలో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. జగన్, పవన్తో కలిసి బీజేపీ పనిచేస్తోందనడం అబద్ధమని అన్నారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదనేది అసత్యప్రచారమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆమె స్పష్టం చేశారు.
సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లుగా టీడీపీ..
ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని అన్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని సోమవారం ఆయన కలుసుకున్నారు. బీజేపీ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన బుక్ లెట్ ను శివాజీకీ అందజేశారు. అనంతరం, కన్నా మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలను తెలిపేందుకు సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో, టీడీపీ వాళ్లు మాట్లాడితే అలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ-వైసీపీ కో-రిలేషన్ ప్రభుత్వం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని చెప్పమనండి అని ప్రశ్నించారు.