రాధా.. ఎందుకంత బాధపడ్డారు..! బాస్ వ్యవహారమే ఆయనను బయటకు పంపిందా..?
అమరావతి/ హైదరాబాద్ : సహజంగా రాజకీయ పార్టీల్లో నాయకుల మద్య అలకలు, చిరు కోపాలు, చిన్న పాటి మనస్పర్థలు సహజంగా ఉంటాయి. కాని పార్టీ అదినేత అవి గమనించి ఎప్పకప్పుడు నేతల మద్య నెలకొన్న అలాంటి పరిణామలను సామరస్య వాతావరణంలో చర్చించి అందరిని మళ్లీ ఏకతాటిపైకి తీసుకొస్తూ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తుంటాడు. అందుకు ఆయనను పార్టీ అధినేతగా సంభోదిస్తుంటారు. కాని అలాంటి పార్టీ అధినేతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అదే పార్టీలో నమ్మంకంగా పనిచేస్తున్ననాయకుల పరిస్థితి ఏంటి..? అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్టీ అద్యక్షుడే సరిదిద్దుకోలేని పొరపాట్లు చేస్తే పార్టీ కోసం పనిచే్తున్న నేతల పరిస్థితి ఏంటి..? తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగవీటి రాధా బయటకు ఎందుకు వెళ్లారు..? పార్టీ అధినేత తొందరపాటు చర్యలే ఇందుకు కారణం కాదా అనే చర్చ జరుగుతోంది.
జగన్ దుందుడుకు స్వభావం..! పార్టీ నేతలకు శరాఘాతం..!!
నాన్నగారు వెళ్లిపోతూ నాకో పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లి పోయారు. ఇప్పుడు ఆ కుటుంబం బాద్యత నాదే..! అని జగన్ మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం సందర్బంగా చెప్పిన అన్న మాటలు. కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తున్నారు గాని కుంటుంబ సభ్యులను మాత్రం సమానంగా చూసుకోవడం లేదనే భావన పార్టీ నేతల్లో నెలకొంది. రాజకీయ అనుభవ రాహిత్యంతో కలిసొచ్చిన కాలాన్ని కూడా జగన్ కాలదన్నుకుంటున్నాడనే అపంత్రుప్తిని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల ముందు సరిదిద్దుకోలేని తప్పులు చేయడం, ప్రజలకు దూరం అవ్వడం వైసీపిలో సహజంగా జరిగిపోతుందనే ప్రచారం కూడా మొదలైంది.
కాపులను దూరం చేసుకున్న జగన్ ప్రకటన..! కాపుల మనోభావాలకు విఘాతం..!!
వాస్తవానికి వైసీపికి రెండు సామాజిక వర్గాల్లో మాత్రమే మాత్రమే బలమైన ఓటు బ్యాంకు కలిగిన జగన్ కొన్ని పొరపాట్ల కారణంగా నేతలు దూరం అవతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో నాలుగు జిల్లాల్లో గణనీయంగా కాపు ఓటు బ్యాంకు ఉంది. కాపులు కొత్తలో వైసీపికి అనుకూలంగా ఉన్నా తర్వాత మారిన పరిణామాల నేపథ్యంతో తటస్థంగా వ్యవహరిస్తున్నారు. అందుకే చంద్రబాబు కాపు రిజర్వేషన్లు అనే అంశాన్ని లేవనెత్తి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రలో ఉన్నపుడు కాపుల విశయంలో జగన్మోహన్ రెడ్డి ఓ సరిదిద్దుకోలేని తప్పుచేసారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
కాపు రిజర్వేషన్ వీలుకాదన్న జగన్..! అసందర్బ ప్రకటనతో ఇబ్బందులు..!!
అదే కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని. అది తనకు చేత కాదని బహిరంగ ప్రకటన చేసారు. ఆ వ్యాఖ్యలపై కాపుల మనోభావాలు ఒక్కసారిగా చివుక్కుమన్నాయి. పైగా ఆ సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ వ్యాఖ్యలు చేయడం జగన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. తర్వాత తేరుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా అప్పటికే సమయం మించిపోయిందనే భావన ఏర్పడింది. దీంతో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకులో జగన్పై భారీ వ్యతిరేక ముద్ర పడింది. తాజాగా కాపులు తమ నాయకుడిగా గుర్తించే వంగవీటి కుటుంబంపై వైఎస్ జగన్ చాలా హేయంగా వ్యవహరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
కాపుల్లో నమ్మకం తీసుకురాలేక పోయిన జగన్..! అందుకే రాధా నిష్క్రమణ..!!
అంత పెద్ద సామాజిక వర్గానికి ప్రతినిధిగా భావించే వంగవీటి కుటుంబం వారసుడు రాధాను తీవ్రంగా అవమానించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు లోటస్పాండ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో జగన్ పేరు చెప్తుంటే కాపులు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పైగా పవన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ను కాపు వ్యతిరేకిగా మార్చాయి. కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లను కాపు రిజర్వేషన్లుగా మారుస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఓ అవకాశం చంద్రబాబుకు వస్తుందని జగన్ అస్సలు ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా కాపులు చంద్రబాబు వైపు చూసే పరిస్థితి. రిజర్వేషన్లు, వంగవీటి విషయంలో జగన్ చేసిన భారీ తప్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుండడమే కాకుండా రాధా లాంటి యువ నాయకుడు పార్టీనుండి వెళ్లి పోయేందుకు కారణమయ్యాయి.