వైసీపీ అధ్యక్ష పోటీకి సిద్దం- ఎన్నికల సంఘానికి రఘురామ లేఖ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీకి సిద్దమని పేర్కొన్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. వైఎస్సార్సీపీ పైన స్పష్టత ఇవ్వాలని కోరారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని గత ప్లీనరీలో వైఎఎస్సార్ కాంగ్రెస్ గా మార్చుతూ నిర్ణయంచిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దీని పైన పార్టీ నుంచి అధికారికంగా సమాచారం ఉందా అని లేఖలో స్పష్టత కోరారు. ఎన్నికల సంఘం రికార్డుల మేరకు పార్టీ పేరు ఏముందనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి రఘురామ సందేహాలు లేవనెత్తారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని రఘురామ పేర్కొన్నారు.
ఎంపీ రఘురామ రాజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. పార్టీ ప్లీనరీ సమయంలో జీవితా కాల పార్టీ అధ్యక్ష పదవికి ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ప్రకటన చేసారని లేఖలో పేర్కొన్నారు. తరువాతి కాలంలో వైసీపీ మరో ప్రధాన కార్యదర్శి సజ్జల చేసిన వ్యాఖ్యలను లేఖలో వివరించారు. జీవిత కాల అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టినా ఎన్నికల తరువాత నాయకుడు ఆ పదవికి ఒప్పుకోలేదని చెప్పిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని జీవిత కాల అధ్యక్ష పదవికి చేపట్టిన ఎన్నికలు చెల్లవని రఘురామ తన లేఖలో స్పష్టం చేసారు. ఈ రెండు ప్రకటనల ద్వారా జీవిత కాల అధ్యక్ష పదవికి ఎన్నికలు చెల్లవని పేర్కొన్నారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించేలా తమ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని రఘురామ కోరారు. ఎన్నికలు నిర్వహిస్తే తాను పోటీకి సిద్దమని స్పష్టం చేసారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయని కారణంగా..తాను అధ్యక్ష పదవికి పోటీకి అర్హుడిగా పేర్కొన్నారు. రఘురామ అటు ప్రభుత్వం..ఇటు పార్టీ వ్యవహారాల్లో వైసీపీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆయన ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రఘురామ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు రాసిన లేఖ పైన చర్చ సాగుతోంది. దీని పైన ఎన్నికల సంఘం.. వైసీపీ ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications