రఘురామ కేసులో మరో కీలక పరిణామం-హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ ప్రభావతి వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతితో పాటు పలువురని పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్లను స్థానిక కోర్టుతో పాటు హైకోర్టు కూడా కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రఘురామపై కస్టడీ హింస కేసులో నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో ఈ కేసులో ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ను స్థానిక కోర్టుతో పాటు హైకోర్టు కూడా కొట్టేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఆమెను తక్షణం అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పోలీసుల్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రఘురామపై అప్పట్లో కస్టడీలో సీఐడీ అధికారులు, పోలీసులు, ప్రైవేటు వ్యక్తుల దాడి తర్వాత డాక్టర్లు ఆయన్ను తిరిగి రిమాండ్ కు పంపే ముందు గాయాలు అయినట్లు నివేదిక ఇచ్చారు. అయితే ఈ రిపోర్టుల్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ ప్రభావతి మార్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రఘురామకు ఎలాంటి గాయాలు కాలేదని రిపోర్టు ఇచ్చారు. ఆ తర్వాత రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లతో పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయనకు గాయాలైనట్లు తేల్చడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications