కెసిఆర్ చెప్పుచేతల్లో చంద్రబాబు: విలీన గ్రామాలపై రఘువీరా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ముంపు మండలాల నుంచి ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు.
టీడీఎల్పీలో మాత్రమే చర్చించి.. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు ఎలా బదలాయిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎలా నడవమంటే చంద్రబాబు అలా నడుస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మంత్రదండం కేసీఆర్ చేతిలో ఉందని రఘువీరా అన్నారు. ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి బదలాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతన్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విలీన గ్రామాలు ఏపీలో ఉండాల్సిందేనని రఘువీరా డిమాండ్ చేశారు.