రాత్రి వేళ మహిళా టెక్కీపై రైల్వే టిటిఈ కీచకత్వం
ఒంగోలు: రైల్లో ప్రయాణిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పట్ల గుంటూరుకు చెందిన రైల్వే టిటిఇ గంగయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని నెల్లూరు రైల్వేపోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సుమారు 25సంవత్సరాలు కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆదివారం రాత్రి తన భర్త, తండ్రితో కలిసి గుంటూరు రైల్వే స్టేషన్కు వచ్చింది.
ఆమె ఉద్యోగం చేస్తున్న చెన్నైకు వెళ్లేందుకు 12604 హైదరాబాద్- చెన్నై ఎక్స్ప్రెస్లో ఎక్కారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రకారం ఏసి కంపార్ట్మెంటులో వెయిటింగ్లిస్టు వచ్చింది. దీంతో ఆమెతోపాటు భర్త, తండ్రి బి -1 కోచ్ టిటిఇ గంగయ్యను బతిమిలాడి బెర్త్ ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించి అంత వరుదాకా తన సీటులో కూర్చోమని చెప్పాడు. జాగ్రత్తగా చెన్నైలో దించుతానని వారికి హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. రైలు చినగంజాం వచ్చిన తర్వాత బెర్త్లో ఆమె పక్కకు చేరి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
దీంతో టిటిఇ చర్యల్ని ఆమె ప్రతిఘటించి అక్కడే ఉన్న బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని తన భర్తకు సెల్ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఆమె భర్త వెంటనే రైల్వేకంట్రోల్ రూంకు ఫోన్చేసి చెప్పటంతో పాటు ఒంగోలు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో రైలు ఒంగోలు చేరుకునే సరికి రైల్వే పోలీసుస్టేషన్ ఎస్ఐ భావన్నారాయణ టిటిఇ గంగయ్యను కూడా పిలిపించారు.
గంగయ్య వద్దనుండి ఐడి కార్డును తీసుకుని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం నెల్లూరు రైల్వేపోలీసు స్టేషన్ సిఐ విజయకుమార్కు అప్పగించారు. సిఐ విజయకుమార్ టిటిఇ గంగయ్యను అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చినట్లు చెప్పారు.