సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : కోచ్ లు రెట్టింపు, టీటీ వద్దే టికెట్..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. సికింద్రాబాద్ - విశాఖ రైలుకు అంచనాలకు మించి స్పందన కొనసాగుతోంది. కొత్తగా ప్రారంభించిన సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు ఆదరణ బాగుండటంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న కోచ్ లను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. వందేభారత్ ఎనిమిదిన్నార గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోనుండటం తిరుమల భక్తలకు ఉపయోగంగా మారింది. టికెట్ల విషయంలో రైల్వే అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు.
అనూహ్యంగా పెరిగిన ఆదరణ:ఈ నెల 8న సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రారంభం నుంచి ఈ రైలు పైన ప్రయాణీకుల్లో ఆసక్తి కనిపించింది. రైలు ప్రారంభమైన పది రోజుల్లోనే మంచి ఆదరణ కనిపించింది. ప్రారంభం నుంచి ఈ రైలు ఎనిమిది కోచ్ లతో నడుస్తోంది. ఏడు చైర్ కార్ కోచ్ లతో పాటుగా ఒకటి ఎగ్జిక్యూటివ్ బోగీ ఉంది. అనూహ్యంగా ఈ రైలు ప్రయాణం కోసం ప్రయాణీలకుల డిమాండ్ పెరిగింది. తిరుమలకు వెళ్లే భక్తుల నుంచి పెరుగుతున్న డిమాండ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఎనిమిది కోచ్ లను రెట్టింపు చేయాలని సూచించారు. ఇందుకు రైల్వే బోర్డు నుంచి సానుకూలత వ్యక్తం అయింది. త్వరలోనే సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ 16 కోచ్ లతో నడిపిందుకు రంగం సిద్దం అవుతోంది.

శ్రీవారి భక్తులకు ప్రయోజనకరంగా:వందేభారత్ అందుబాటులోకి వచ్చిన తరువాత తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ప్రయోజనకరంగా మారింది. సమయం తక్కువ కావటంతో పాటుగా ముందుగా బుక్ చేసుకున్న దర్శనం సమయానికి తిరుమల చేరుకోవటానికి అవకాశం ఏర్పడుతోంది. ఉదయం సమయంలో దర్శనం బుక్ చేసుకున్న వారికి ముందు రోజు రాత్రికి తిరుమల చేరుకొని దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. ఆ వెంటనే మధ్నాహ్నం తిరుపతి నుంచి వందేభారత్ ద్వారా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో, గడిచిన పది రోజుల సమయంలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న ఇతర రైళ్ల కంటే వందేభారత్ కు ఆదరణ పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. టికెట్ రిజర్వేషన్ లోనూ వందేభారత్ కు ప్రయాణీకులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
టీటీ వద్ద టికెట్ అవకాశం:వందేభారత్ ప్రస్తుతం నారాయణాద్రి ప్రయాణ మార్గంలో కొనసాగుతోంది. శబరి, రాయలసీమ, నారాయణాద్రి, వెంకట్రాది వంటి రైళ్లతో సమానంగా వందేభారత్ కు రిజర్వేషన్ అవకాశం కల్పించారు. నిత్యం రైలు బయల్దేరే సమయానికి వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. రైలు బయల్దేరటానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ ఛార్ట్ సిద్దం చేస్తారు. ఆ తరువాత అందుబాటులో ఉన్న మేరకు కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వందేభాతర్ లో రైలు బయల్దేరటానికి అరగంట ముందు వరకు టీటీని సంప్రదించి టికెట్ పొందేకు వీలుగా సదుపాయం కల్పించారు. దీని ద్వారా రిజర్వేషన్ అందని వారు ఈ ప్రయత్నం ద్వారా టికెట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. వేసవి కావటంతో తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీతో వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications