ఏపీ ప్రజలు గొడుగులు కొనుక్కోండి!!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, ఒడిసా తీరంలో ఏర్పడిన అల్ప పీడనం తీర ప్రాంతాలకు విస్తరించింది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంవల్ల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ చెప్పారు. రానున్న 48 గంటల్లో ఇది ఒడిశా మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించనుంది. ఈ ప్రభావంతో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అంబేద్కర్ వెల్లడించారు. మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ముసురు ఉంటుందన్నారు.

ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీనివల్ల ప్రభావితమయ్యే జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు పర్యవేక్షిస్తోంది. అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడంతోపాటు సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణం చేయవద్దని సూచించారు. వరద నీళ్లల్లో చేపలు పట్టడం, ఈతకు వెళ్లడం లాంటివి చేయొద్దన్నారు. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 6,48,291 ఉందని.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అంబేద్కర్ వివరించారు.












Click it and Unblock the Notifications