వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్న జగన్ ఆత్మీయుడి సోదరుడు ?
ఏపీలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాక విపక్ష వైసీపీకి ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి అధికార కూటమిలోకి వెళ్లిపోతుండగా.. ఇప్పుడు అదే బాటలో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నేతలు సైతం చేరిపోతున్నారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్ కు, వైఎస్ కుటుంబానికి ఆత్మీయంగా మెలిగే ఓ కుటుంబానికి చెందిన నేత ఇప్పుడు పార్టీని వీడబోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు అధినేత వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. గతంలో జక్కంపూడి కుటుంబానికి సైతం వైఎస్ కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు ఉండేవి. అయితే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఓ నేత పెత్తనం ఎక్కువైపోయందనే అసంతృప్తిని ఆయన పార్టీ అధిష్టానానికి కూడా చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తగిన స్పందన రాకపోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు. నియోజకవర్గంలో ఓ నాయకుడి వల్ల వైసీపీ నష్టపోతోందని జక్కంపూడి గణేష్ తెలిపారు. ఎందుకు పార్టీ వీడుతున్నానో అధిష్ఠానానికి చెప్పానని, రెండు రోజుల్లో ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలు బయటపెడతానని జక్కంపూడి గణేష్ వెల్లడించారు. దీంతో జక్కంపూడి గణేష్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారనేది స్ధానికంగా ఉత్కంఠ రేపుతోంది. అసలే జక్కంపూడి రాజా ఓసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. ఆయన సోదరుడు ఇప్పుడు పార్టీని వీడితే రాజా కష్టాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది..












Click it and Unblock the Notifications