చంద్రబాబూ! బయటకు రాలేవు, మోడీని ఏ శక్తి అడ్డుకోలేదు: రాజ్నాథ్ హెచ్చరిక
గుంటూరు: ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం గుంటూరులో అన్నారు. ఆయన ఈ రోజు గుంటూరులో పర్యటించారు. మంగళగిరిలో నిర్మించనున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గుంటూరు నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

పీవీ నర్సింహారావును అవమానించింది
సంపూర్ణ మెజార్టీతో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీయే అన్నారు. సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మాజీ ప్రధాని నరసింహ రావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పీవీ చేసినసేవలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ ఉచ్చులో పడ్డ చంద్రబాబు
నెహ్రూ కుటుంబానికి స్వార్థ రాజకీయాలే ముఖ్యమని విమర్శలు రాజ్నాథ్ గుప్పించారు. బీజేపీకి మాత్రం దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వేసిన ఉచ్చులో పడ్డారని విమర్శించారు.

బయటకు రాలేవు, మోడీని ఎవరూ అడ్డుకోలేరు
ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడటమే కానీ బయటకు రావడం మాత్రం జరగదని రాజ్నాథ్ హెచ్చరించారు. నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో, జాతీయస్థాయిలో వెంటిలెటర్ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీతో నాలుగు సీట్లు సంపాదించాలని చంద్రబాబు ఆశ అని ఎద్దేవా చేశారు.

కేంద్రం నుంచి భారీ నిధులు
ఈ సందర్భంగా రాజధాని సహా కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి రాజ్నాథ్ చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.7150 కోట్లు ఇచ్చిందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1050 కోట్లు ఇఛ్చామన్నారు.












Click it and Unblock the Notifications