మోడీ విన్పై రజనీకాంత్, అతనేనని జైరాం: నగ్మా ఓటమి
చెన్నై/లక్నో: సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. రజనీకాంత్ ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. చారిత్రకమైన గెలుపు సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సందేశం ఉంచారు. తన విషెస్ తెలిపారు.
బిజెపి గెలుపు పైన జైరాం రమేష్ మాట్లాడారు. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభావమేనని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని చెప్పారు. అర్ఎల్డీ నేత అమర్ సింగ్ బిజెపికి అభినందనలు తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లో, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, ఢిల్లీలో 7, గోవాలో 2, ఉత్తరాఖండులో 5 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఉన్న ఒక్కో స్థానాల్లో బిజెపినే అఖండ విజయం సాధించింది.
నగ్మా ఓటమి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుండి పోటీ చేసిన కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, ప్రముఖ నటి నగ్మా ఓడిపోయారు. చండీగఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పోటీ చేసిన గుల్ పనాగ్ పైన బిజెపి అభ్యర్థి కిరణ్ ఖేర్ గెలుపొందారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ బన్సల్ ఓడిపోయారు.