అమిత్ షాతో 40 నిముషాల భేటీ
భారతీయ జనతాపార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. పార్లమెంటుకు సమీపంలో ఉన్న అమిత్ షా కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మంత్రి పదవితోపాటు పార్టీ రాజకీయాలను పర్యవేక్షిస్తూ నిత్యం బిజీగా ఉండే అమిత్ షాతో ఏకంగా 40 నిముషాల భేటీ అనేది సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి సంబంధించి ఏయే చర్యలు చేపట్టాలనే విషయమై సీఎం రమేష్ కు.. షా దిశానిర్దేశం చేశారు. గత నెలలో విశాఖ వచ్చిన ప్రధాని రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న మోడీ-షా అందుకు తగ్గ అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు.

ఈ క్రమంలోనే వారు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి 144 లోక్ సభ నియోజకవర్గాలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినమేర ఈ 144తో లోటును పూడ్చుకోవచ్చని, అధికారం సులువవుతుందని వారిద్దరూ భావిస్తున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి వెళితే ప్రయోజనముంటుందని రమేష్ చెప్పినట్లు సమాచారం. దీనిపై ఆయన కాస్తంత లోతుగా విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా టీడీపీవైపే లాగుతుంటుందనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications