22న చారిత్రక ఆలయంలో టీటీడీ బ్రహ్మోత్సవం: చురుగ్గా ఏర్పాట్లు
Ram Navami 2024: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాల సందర్భంగా ఏ ఒక్కరికీ అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తుల ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతాఅధికారులు అంచనా వేస్తోన్నారు.

వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి ఈ ఏర్పాట్లను కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు.
సీతారాములవారి కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను విరివిగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కౌంటర్లు, గ్యాలరీలలో కూర్చునే భక్తులకు ప్రసాదాలను అందజేయడానికి అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వారికి తగిన భద్రత కల్పించాలని చెప్పారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రతను పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని అన్నారు. సీసీ కెమెరాలతో 24 గంటల పాటు నిఘా ఉంచాలని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్లు అధికారులు ఆయనకు వివరించారు.
భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోన్నామని, భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications