అమరావతి శంకుస్థాపనకు రాందేవ్ బాబా, నవ్యాంధ్ర పేరుతో కత్తి పద్మారావు కొత్త పార్టీ
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు యోగా గురు రాందేవ్ బాబాను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో యోగా గురువు బాబారాందేవ్ను ఆయన కలిశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో యోగా ధ్యాన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే యోగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో ఎయిమ్స్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
సాంకేతిక సమస్యల వల్లే ఎయిమ్స్ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కాగా, ఈ నెల 22 జరగనున్న రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాందేవ్ బాబాను మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆహ్వానించినట్లు తెలిపారు.
నవ్యాంధ్ర పేరుతో కత్తి పద్మారావు కొత్త పార్టీ
నవ్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తిపద్మారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన పార్టీని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. టీడీపీ, వైసీపీ కులాల పార్టీలుగా మారాయని ఆయన విమర్శించారు. తాము ఏర్పాటుచేస్తున్న కొత్త పార్టీలో జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సీట్లు కేటాయిస్తున్నామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యం : కాకాణి గోవర్ధన్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు వల్లే చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నారని మండిపడ్డారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై ‘ఆబ్కారీ' దాడులు
కృష్ణాజిల్లా గ్రామాల్లో ఉన్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ దాడులు చేసింది. 34 గ్రామాల్లో చేసిన ఈ దాడుల్లో 245 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా, 11,950 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, 33 కేసులు నమోదు చేసి, 23 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నాటు సారా మత్తులో పడి కార్మికులు, కూలీలు తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారని, నాటు సారాను అరికట్టేందుకే ఈ దాడులు నిర్వహించామని చెప్పారు.