మీ అన్నయ్యను అడుగు: పవన్కు రాయపాటి తనయుడి బహిరంగ లేఖ
తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి సాంబశివరావు ఇప్పటికే స్పందించారు. తాజాగా ఆయన కుమారుడు రంగబాబు పవన్కు ఓ బహిరంగ లేఖ రాశారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివ రావు కుమారుడు రంగబాబు ఓ బహిరంగ లేఖ రాశారు. బ్యాంకు అప్పుల గురించి రాయపాటి సాంబశివ రావు ఇప్పటికే స్పందించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఓ బహిరంగ లేఖ రాశారు.
తాము బడుగు, బలహీనవర్గాలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చామని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినట్టు.. రైతుల పొలాల్లో డంప్యార్డు ఏర్పాటు చేసినట్టు మీరు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఆ బహిరంగ లేఖలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి అన్నారు. "మీరు చేస్తున్న వ్యాఖ్యలు మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి" అని పవన్ కల్యాణ్కు సూచించారు.
తాము ఇంతవరకూ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టలేదని, పర్యావరణానికి హాని కలిగించని విధంగా సంబంధిత అధికారుల అనుమతితోనే డంప్యార్డు ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఎకరాకు రూ.19.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామని, ఈ విషయాలన్నీ పవన్ తెలుకుని మాట్లాడితే మంచిదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై ఎక్కడా రాజీ పడలేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియాకు వ్యతిరేకంగా పార్లమెంట్లో తన తండ్రి తెలుగువారి గొంతు వినిపించిన విషయం పవన్ కల్యాణ్ మర్చిపోయినట్లున్నారని ఆయన అన్నారు. "పవన్.. ఆనాడు కేంద్రాన్ని ఎదిరించిన ఏకైక వ్యక్తి మా నాన్నే" అని రంగబాబు అన్నారు.
తాము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం గానీ పెంచుకోలేదని అంటూ "ఈ విషయం గురించి మీ అన్నను అడిగితే వాస్తవాలు చెబుతార"ని ఆయన పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ్న్ారు. ఇక ముందు తమ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన కోరారు.