చంద్రబాబు - రఘురామ ఆలింగనం : సీఎం జగన్ ను రెచ్చగొట్టే వ్యూహం - మైండ్ గేమ్ మొదలెట్టేసారు..!!
తిరుపతి సభా వేదికగా ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించా లనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు..జేఏసీ నేతలు చేసిన పాదయాత్రకు ముగింపుగా సభ కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ..సీపీఎం మినహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సభకు వచ్చారు.

చంద్రబాబు - రఘురామ బంధం ఓపెన్
ఆయన తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న సమయంలోనే అమరావతి రైతులు స్వాగతం పలికారు. ఆయన వేదిక పైన అమరావతికి మద్దతుగా మాట్లాడారు. అమరావతిని రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. వేదిక మీదకు టీడీపీ అధినేత చంద్రబాబు రాగానే..ఆయన వద్దకు వెళ్లిన రఘురామ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు కూడా రఘురామను భుజం తట్టి పంపారు. వైసీపీ ఎంపీగా గెలిచినా.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు.. మూడు రాజధానుల అంశాన్ని రఘురామ రాజు వ్యతిరేకిస్తున్నారు.

ఆత్మీయత - ఆలింగనం
తన జన్మదినం నాడు హైదరాబాద్ లో సీఐడీ పోలీసుల అరెస్ట్.. సుప్రీం బెయిల్ తో బయటకు వచ్చిన రఘురామ అప్పటి నుంచి ఏపీకి రాలేదు. తిరిగి ఈ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఆయన పైన వైసీపీ అనర్హత పిటీషన్ సైతం ఇచ్చింది. దీని పైన నోటీసులు ఇచ్చామని..విచారణలో ఉందని స్పీకర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, రఘురామ రాజు తాను సభలో పాల్గొనటాన్ని సమర్ధించుకున్నారు. అది రాజకీయ సభ కాదని..దగా పడిన రైతుల సభగా పేర్కొన్నారు.

ఆ కేసు తరువాత తొలిసారి ఏపీలో
రఘురామ రాజు ను సీఐడీ పోలీసుల విచారన తరువాత కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ ఆయన టీడీపీ ముఖ్యనేతలతో ఛాటింగ్ చేసినట్లుగా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ నడుస్తున్నారంటూ పలు సందర్భాల్లో వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక, ఇప్పుడు నేరుగా..బహిరంగ సభ వేదికగా చంద్రబాబును ఆలింగనం చేసుకోవటం ద్వారా సీఎం జగన్ కు ఓపెన్ గా సవాల్ చేసినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాజకీయ వ్యూహంలో భాగంగానే..అమరావతి సభకు అన్ని పార్టీల నేతలు కలిసి వచ్చేలా వ్యవహరించారు.

చంద్రబాబు మైండ్ గేమ్
బీజేపీ .. కాంగ్రెస్ పార్టీలు సైతం ఒకే వేదికను పంచుకోవటం..అందునా చంద్రబాబు సభలో ముఖ్యఅతిధిగా ప్రసంగించటం ద్వారా సీఎం జగన్ కు వ్యతిరేకంగా వారందరినీ కలుపుకుపోవటం టీడీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే వేదిక మీదకు రఘురామ రావటం వెనుక పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పడుు రఘురామ రాజు పైన పార్టీ పరంగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేవనే చెప్పాలి. అది ఆయనకు మరింత అవకాశంగా మారుతుందనే అంచనాల్లో వైసీపీ నేతలున్నారు. రఘురామ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని లోక్ సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ ఏం చేయబోతున్నారు..
అయితే, ఇప్పుడు చంద్రబాబు ను ఆలింగనం చేసుకోవటం ద్వారా ఆయన టీడీపీ అధినేతతోనూ సన్నిహితంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రఘురామ పైన అనర్హత కోసం వైసీపీ పార్లమెంటరీ నేతలు ప్రయత్నించినా..ఇప్పటికీ సాధ్యపడ లేదు. ఇక, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వచ్చిన రఘురామ రాజు... చంద్రబాబును బహిరంగ వేదిక పైన ఆలింగనం చేసుకోవటంతో..ఇప్పుడు సీఎం జగన్..వైసీపీ ముఖ్యనేతలు ఏం చేస్తారనేది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. ఇక, చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి జగన్ ను రాజకీయంగా ఇరుకున పెట్టటంతో పాటుగా... మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications