రేషన్ కార్డు దారులకు శుభవార్త.. తిరుపతితో సహా ఆ నగరాల్లో వారంతా నక్కతోక తొక్కినట్టే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఇదే క్రమంలో ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూడా మెరుగైన రేషన్ సేవలు అందించడం కోసం సంకల్పించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఇక ఇదే క్రమంలో తాజాగా రేషన్ కార్డుదారుల కోసం మరో శుభవార్త తీసుకువచ్చింది.
12 గంటల పాటు రేషన్ షాపులు
రేషన్ సరుకుల కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడకుండా 12 గంటల పాటు రేషన్ షాపులను మినీ మాల్స్ గా మార్చి నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ముఖ్య నగరాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్లాన్ అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలలో మొదట ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మినీ మాల్స్ లో ఈ ఉత్పత్తులు కూడా
మినీ మాల్స్ లో రేషన్ తో పాటు వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల నుండి ఉత్పత్తులను ప్రజలకు అందించనున్నారు. సహజంగా రేషన్ షాపులు ప్రతినెల ఒకటవ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు.
ఒక్కో నగరంలో 15 చొప్పున మినీ మాల్స్ గా రేషన్ షాపులు
మినీ మాల్స్ గా ఏర్పాటు చేస్తే రోజు 12 గంటల పాటు ఈ మాల్స్ ను నడపనున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో నగరంలో 15 చొప్పున 75 రేషన్ షాపులను ఎంపిక చేసి వాటిని మినీ మాల్స్ గా మార్చి నిర్వహిస్తారు. ఈ విధానంలో రేషన్ కార్డుదారులకు మాత్రమే కాకుండా, రేషన్ షాపులు నిర్వహించే వారికి కూడా లబ్ధి జరుగుతుంది.
మినీ మాల్స్ లో ఈ చిరు ధాన్యాల విక్రయం
కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ వంటి రేషన్ సరుకులు మాత్రమే కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి వివిధ రకాల పోషక చిరుధాన్యాలను కూడా ఈ మాల్స్ లో అందిస్తారు. గిరిజన ప్రాంతాలలో తయారుచేసిన గిరిజన సొసైటీ ఉత్పత్తులు కూడా విక్రయిస్తారు. వ్యవసాయ సహకార సొసైటీ ఉత్పత్తులను కూడా మినీ మాల్స్ ద్వారా విక్రయాలు జరుపుతారు.
ప్రభుత్వ నిర్ణయంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు
దీనివల్ల వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన సొసైటీలకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుంది. ఏది ఏమైనా రేషన్ కార్డుల లబ్ధిదారులకు, రేషన్ షాపుల నిర్వాహకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని వర్గాలకు కూడా లాభం చేకూరుతుంది.












Click it and Unblock the Notifications