సుప్రీం కోర్టు జోక్యంతో ఆగుతుంది: విభజనపై రాయపాటి
హైదరాబాద్/గుంటూరు: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యంతో విభజన ఆగిపోతుందని తాము భావిస్తున్నామని గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు బుధవారం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా బహిష్కృత ఎంపీలందరమూ కలసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు రాజముద్ర పడినందున కోర్టు సైతం తమ వాదనలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కేంద్రమంత్రి జైరాం రమేష్తో సహా కొందరు వ్యక్తులు సుప్రీం న్యాయమూర్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల ద్రోహి అయిన జైరాంను ఊరేగించడం సరికాదని, జైరాం మాటలు సీమాంధ్ర ప్రజలను ఎగతాళి చేసే విధంగా ఉన్నాయన్నారు.
పిసిసిలపై త్వరలో నిర్ణయం: టిఎస్సార్
ప్రత్యేక పిసిసిలు, ప్రాంతీయ కమిటీలపై అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్బిరామి రెడ్డి అన్నారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధుల కేటాయింపుపై ప్రధానిని కలిశాక స్పష్టత ఇస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారన్నారు. దిగ్విజయ్, తాను కలిసి ప్రధానితో మాట్లాడి నిధుల అంశంపై హామీ తీసుకుంటామన్నారు.
మున్సిపల్ ఫలితాలు ప్రకటించొద్దు
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకూడదని తెరాస సీనియర్ నేత వినోద్ హైదరాబాదులో అన్నారు. లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణవాదానికే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ నిషేధించినందున మున్సిపల్ ఫలితాలపై కేంద్ర, రాష్ట్ర కమిషన్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.