నల్లబజారు: తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతపై ఆర్బీఐ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరత సమస్యపై భారత రిజర్వు బ్యాంకు స్పందించింది. నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు తిరిగి నల్లబజారుకు చేరినట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రం కావడానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తోంది. నోట్ల రద్దుకు ముందు.. తర్వాత బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై ఆర్బీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగదు కొరత సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలపై విస్తృతంగా ప్రచారం కల్పించి.. ఆ దిశగా ప్రోత్సహించాయి.
పట్టణ, నగరాల్లోని విద్యావంతులైన ఖాతాదారులు సింహాభాగం డిజిటల్ లావాదేవీలతోనే తమ రోజూవారీ అవసరాలను తీర్చుకోవడం అలవర్చుకున్నారు.
ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే, నగదు ఆధారంగా లావాదేవీలు జరిగే గ్రామాల్లో మాత్రం నగదు కొరత ఇప్పటికీ తీవ్రంగా వేధిస్తోంది. కొత్త నోట్ల ముద్రణతో నగదు కొరత తీరిపోతుందని ప్రజలు భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నోట్ల కొరతను తీర్చేందుకు కొత్త నోట్లను విడుదల చేస్తామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది.












Click it and Unblock the Notifications