మూడు రాజధానుల ప్రకటనను తాను స్వాగతించింది అందుకే అంటున్న గంటా .. ఏం చెప్పారంటే..
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని చేసిన ప్రకటనపై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్వరంతో విరుచుకుపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని ఆయన తేల్చి చెబుతున్నారు. అయితే చంద్రబాబుకు బాసటగా నిలవాల్సిన టిడిపి నేతలు మాత్రం చంద్రబాబుకు వరుస షాక్ లు ఇస్తున్న వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఒక్క రాజధానికే దిక్కు లేదు ..33 కడతారా ? .. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజధాని రైతులు
జగన్ నిర్ణయాన్ని స్వాగతించటంపై గంటా క్లారిటీ
మొదట జగన్ ప్రకటన చేసిన వెంటనే జగన్ నిర్ణయాన్ని స్వాగతించింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు, మాజీ మంత్రులు జగన్ చేసిన ప్రతిపాదనకు జై అంటున్నారు. ఇక తాను జగన్ చేసిన ప్రకటనకు అనుకూలంగా మాట్లాడటంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం తనకు ఎప్పటి నుండో ఉందని గంటా పేర్కొన్నారు.
రాజధానిగా విశాఖ అర్హమైనది అన్న గంటా శ్రీనివాసరావు
రాజధానిగా విశాఖ అన్ని విధాలా అర్హమైనదని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్న గంటా వంద శాతం రాజధాని ఏర్పాటుకు సరైనదని తన అభిప్రాయం చెప్పారు. విశాఖ వాసిగా, స్థానిక నాయకుడిగా ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు, ఈ నగరంతో తనకున్న అనుబంధం కారణంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను తాను స్వాగతించానని తెలిపారు.
విశాఖ ఆర్ధిక రాజధాని చెయ్యాలని గతంలో కూడా కోరానన్న గంటా
రాజధానిగా విశాఖ సరైన నగరమని తాను గతంలో ఎన్నో సార్లు తాను పేర్కొన్నానని చెప్పిన ఆయన జగన్ చేసిన ప్రకటనపై తాను చెప్పింది వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. . అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని తాను గతంలో కూడా డిమాండ్ చేశానని చెప్పారు. అందుకే జగన్ ప్రకటన చేసిన వెంటనే దాన్ని స్వాగతిస్తూ తాను ట్వీట్ చేశానని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వ్యక్తిగత అభిప్రాయం ... ఇది పార్టీ అభిప్రాయం కాదన్న టీడీపీ ఎమ్మెల్యే
విశాఖ అంశంపై పార్టీ పరంగా ఉన్న అభిప్రాయం తాను మాట్లాడలేదని, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పానని చెప్పిన గంటా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చని అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు రాజధాని అక్కడే ఉండాలని అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చని , అది తమ పార్టీ స్టాండ్ కావచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే విశాఖను రాజధానిగా చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. తాను మాత్రమే కాదు ఉత్తరాంధ్ర వాసులు ఏ ఒక్కరూ, ఇతర పార్టీల నాయకులు కూడా ఎవరూ ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా వద్దు అనలేరని గంటా చెప్పారు.