ఏపీలో రూ.1622 కోట్లతో రిలయన్స్ భారీ ప్లాంట్..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో భారీ ఫుడ్ & బివరేజ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.1622 కోట్ల పెట్టుబడి లభించనుండగా.. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. కాగా జూన్ 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. శీతల పానీయాలు, పండ్ల రసాలు, ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి సంబంధించి రిలయన్స్ సంస్థ పరిశ్రమను నెలకొల్పనుంది.

ఈ ప్రాజెక్టు కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ఐఐసీ (APIIC) ల్యాండ్ బ్యాంకులోని 80 ఎకరాల భూమిని ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహకాలు కూడా అందించనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని అంటున్నారు. పరోక్షంగా ట్రాన్స్పోర్ట్, సరఫరా, ప్యాకేజింగ్, ఫర్మింగ్ తదితర రంగాల్లో మరెన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, 2025 డిసెంబర్ కల్లా ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ మేరకు పరిశ్రమలు & వాణిజ్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, APIIC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications