అరె మామా ఎక్ పెగ్ లా.. అంటే కష్టమే..! మందు బాబులకు రిమ్మ దిగిపోయే సర్కార్ నిర్ణయం..!!
అమరావతి/హైదరాబాద్ : అరె మామా ఎక్ పెగ్ లా.. అరె మామా ఎక్ పెగ్ లా.. అని పాడుకుంటూ మీకిష్టమైన బ్రాండ్ మద్యాన్ని ఆర్డర్ చేసుకునే రోజులకు కాలం చెల్లుతోంది. ఇక రెష్టారెంట్ లలో గానీ మద్యం షాపుల్లో గానీ అందుబాటులో ఉన్న మద్యాన్నే మందు బాబులు సేవించాల్సి ఉంటుంది. అది మందు ప్రియులకు ప్రియమైన మద్యం కాకపోయినప్పటికి అలవాటు ఉన్న వారు వేరే బ్రాండు మద్యం తాగి తీరాల్సిందే. సొంత డబ్బులు పెట్టి ఇష్టమైన బ్రాండును తాగలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేసే పరిస్తితులు తలెత్తాయి. ఏపి నెలకొన్న మద్యం ఆంక్షలపై మందుబాబులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందని ద్రాక్ష కాబోతున్న ప్రియమైన పెగ్గు..! అమ్ముడుపోయే బ్రాండ్ల తమారీకే సర్కార్ మొగ్గు..!!
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై పరిమిత మద్యం బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బ్రాండ్లనూ తగ్గించాలని ఆలోచన చేస్తోంది. అంటే ఏ బ్రాండ్ కావాలంటే అది తీసుకునే పరిస్థితి నుంచి.. పరిమితంగా ఉన్న వాటిలోనే ఏదొకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడునుంది. అయితే అందుబాటులో ఉంచేవి ఫేమస్ బ్రాండ్లేనని, బాగా అమ్ముడుపోయేవేనని అధికార వర్గాలు అంటున్నాయి. ఇటీవల డిస్టిలరీల తో నిర్వహించిన సమావేశంలో ఈ దిశగా అధికారులు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో షాపులు ఏర్పడిన తర్వాత వినియోగదారులు అడగని బ్రాండ్లు ఏవైనా ఉంటే ఇకపై వాటిని ఆర్డర్ చేయబోమని అధికారులు వారితో స్పష్టంచేశారు. ఒకట్రెండు సార్లు చూసి ఆదరణ లేని బ్రాండ్లను ఆపేస్తామని చెప్పారు.
మద్యం బ్రాండ్లకు కోత..! డిస్టిలరీలకు ప్రభుత్వం స్పష్టీకరణ..!!
అయితే ముందే తీసేయాలనుకుంటున్న బ్రాండ్ల వివరాలు మాత్రం అధికారులు చెప్పడం లేదు. కానీ అంతర్గతంగా మాత్రం బ్రాండ్లు బాగా కుదించేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రెగ్యులర్గా ఎక్కువ మంది తాగే బ్రాండ్లు దాదాపు 30 ఉన్నాయి. వాటిని సగానికి కుదించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. పదికి తగ్గించినా ఆశ్చర్యం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 23 డిస్టిలరీలు ఉన్నాయి. అందులో ఏడు ఈమధ్య కాలంలో ఏర్పాటయ్యాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి డిస్టిలరీలు పెట్టిన తర్వాత ఇప్పుడిలా చేస్తే ఏంచేయాలని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆదరణ ఉన్న బ్రాండ్ల పేరుతో కావాలనే కొన్ని బ్రాండ్లను దూరం చేస్తే.. వినియోగదారులు వేరే దారిలేక ఇతరత్రా వాటికి అలవాటుపడతారని, అప్పుడు డిమాండ్ ఉన్న బ్రాండ్ సైతం పడిపోతుందని అంటున్నారు.
బ్రాండ్లు బాగా తగ్గించే ఆలోచన..! మద్య నిషేధంలో భాగంగా చర్యలు..!!
రాష్ట్రంలో షాపులకు మద్యం సరఫరా చేసే కంపెనీలకు, ఎక్సైజ్ శాఖకు మధ్య ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం చేసుకున్న ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో షాపులకు మద్యం సరఫరా చేయవచ్చు. అది వ్యాపారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం వ్యాపారికి లైసెన్సు ఇస్తుంది తప్ప ఫలానా బ్రాండ్ అమ్మాలి, అమ్మకూడదు అనే నిబంధన ఉండదు. ఎక్సైజ్తో ఒప్పందం ఉన్న ఏ బ్రాండ్ను అయినా వ్యాపారులు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రోజూ కాకపోయినా అప్పుడప్పుడు అమ్మే వాటిని కూడా షాపులు అందుబాటులో ఉంచుతాయి. కానీ ప్రభుత్వం ఇకపై చాలా బ్రాండ్లను దూరం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనపై మద్యం ఉత్పత్తిదారుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉత్పత్తిదారుల్లో ఆందోళన..! తప్పదంటున్న ఏపి సర్కార్..!!
ఫలానా బ్రాండ్ను వినియోగదారులు అడగటం లేదని ఎవరు నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని బ్రాండ్లనే ఉంచి, మిగతా వాటికి ఉద్దేశపూర్వకంగా ఉద్వాసన పలకాలని ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని కంపెనీలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం మద్య నిషేధం అని ప్రకటనలు చేస్తుంటే కొన్ని కొత్త బ్రాండ్లు రాష్ట్రంలోకి వచ్చాయని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కొత్త బ్రాండ్లు రావడం, ఉత్పత్తిని ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చివరికి రాజకీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావాల్సిన వారి బ్రాండ్లను ప్రమోట్ చేసి, వారికే లబ్ధి చేకూర్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.