తిరుపతిలో దారుణం: రైలు కింద పడి రిటైర్డ్ జడ్జి దంపతుల ఆత్మహత్య
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్డ్ జడ్జీ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. రైల్వే డిప్యూటీ సుపరింటెండెంట్ రమేష్ బాబు చెప్పిన వివరాల ప్రకారం చదలవాడ ఇంజనీరింగ్ కళాశాలకు సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై వీరు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా జడ్జి పాములూరు సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆ తర్వాత భార్య వరలక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. ఇద్దరు కొన్ని గంటల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అదనపు జిల్లా జడ్జిగా రిటైర్ అయిన సుధాకర్ మధ్యాహ్న సమయంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఆయన పక్కనే దొరికిన సూసైడ్ నోట్లో తన మృతికి కారణం ఎవరూ కాదని... కేవలం కిడ్నీ సంబంధిత వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో రాసిఉంది. ఇక జడ్జీ కొడుకు సందీప్, కూతురు సబితలు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వార్త విన్న వీరు హుటాహుటిని తిరుపతి బయలుదేరి వచ్చారు. ఘటనా స్థలానికి తల్లి వరలక్ష్మీతో పాటు వీరు చేరుకున్నారు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన భార్య వరలక్ష్మీ వెంటనే ఆమె కూడా రైలు కింద పడి మృతి చెందింది.
జడ్జీ సుధాకర్ మృతి తర్వాత తిరిచానూరులో భార్యాభర్తలు ఇద్దరూ ఒక ఇంట్లో నివాసముంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు రైల్వే పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.