బంగారు కడ్డీల్లోనే భక్తి: కెసిఆర్పై రిటైర్డ్ జస్టిస్ వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాస్తు నమ్మకాలపై, దేవుళ్లకు మొక్కులు తీర్చుకునే విషయంపై హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారంనాడు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శాస్త్రీయత - అశాస్త్రీయత అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. వాళ్ల భూములు ఏమైనా ఉంటే వాటిని అమ్ముకుని మొక్కులు తీర్చుకోవాలని చెప్పండంటూ ఆయన కెసిఆర్పై వ్యాఖ్యానించారు.
తెలంగాణ కోసం మొక్కుకున్న మొక్కులను ప్రభుత్వపరంగా తీరుస్తామని ప్రభుత్వం చెబుతోంది కదా! దీనిపై మీరేమంటారని ఒకరు అడిగిన ప్రశ్నకు - వాళ్ల భూములు ఏమైనా ఉంటే అమ్ముకుని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పండి అని వ్యాఖ్యానించారు. వాస్తు బాగాలేదంటూ తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డలో ఏర్పాటు చేస్తారని చెబుతున్నారని, దీనిపై మీరేమంటారంటూ అడిగితే - ఎర్రగడ్డకు అంతకంటే ఎక్కువగా వాస్తు బాగాలేదని చెప్పండని, అక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ఆలోచించండని, వ్యక్తిగత విశ్వాసాలను ప్రభుత్వపరంగా చెప్పడం సరికాదని అన్నారు.

అంతకుముందు ఆయన ప్రసంగిచారు. వాస్తు పేరుతో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టారు. సమాజాన్ని కులాలు, మతాల పేరిట విభజించడం వల్లే మన దేశం బాగా బలహీనపడిందన్నారు. కొందరిని చూస్తుంటే బంగారు కడ్డీల్లోనే భక్తి, ముత్యాల హారాల్లోనే ముక్తి కనిపిస్తోందని చెప్పారు. రాజ్యాంగ రచన సమయంలో విద్యా విధానం, పరిపాలనలో శాసీ్త్రయ దృక్పథం, లౌకిక విధానం ఉండాలనే చర్చలు వచ్చాయని గుర్తు చేశారు. సత్యం, వాస్తవం ఆధారంగా సైన్స్ ఉంటుందని తెలిపారు.
పాలకులు వాస్తు బాగా లేదనే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి తప్పుబట్టారు. శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రదర్శించడం రాజ్యాంగంలోని పౌరుల విధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేశ్, ప్రొఫెసర్ రామచంద్రయ్య, జేవీవీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనాథ్, మాణిక్యాలరావు, ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు, రాజా, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications