రేవంత్ కేసులో ఆధారాలు పక్కాగా: బెయిల్ కూడా రాకపోవచ్చు..!
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపిన కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కనీసం బెయిల్ కూడా దొరక్కుండా చేయవచ్చని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏసీబీ దర్యాప్తు అధికారులు ఆధారాలను చాలా పక్కాగా సేకరించారని, కేసును సరిగ్గా చూపగలితే రేవంత్కు బెయిల్ కూడా రాదని తెలిపారు.
ఈ కేసులో ఆడియో, వీడియో ఆధారాలు చాలా పకడ్బందీగా ఉన్నాయని, ఇదే విషయాన్ని ఎఫ్ఐఆర్లో కూడా రాశారని తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో దొరికిన డబ్బు, వీడియో పుటేజిలను పరిశీలిస్తే, ఎమ్మెల్యేకి లంచం ఇచ్చి ఓటు వేయించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు.
కేసు నిలబడుతుందని, ఏసీబీ అధికారులు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, రిమాండ్ రిపోర్టు పక్కాగా రాశామని, ఎటువైపు నుంచి చూసినా రేవంత్ రెడ్డికి బెయిల్ రాదని చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
బెయిల్ పిటిషన్పై అదేరోజు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని, వాదనలు ఆదేరోజు వినిపించాలని అవనీతి నిరోదక శాఖకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రేవంత్రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేకు రేవంత్రెడ్డి రూ.50 లక్షలు లంచమిస్తూ ఆదివారం అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వారిపై హైదరాబాద్ ఏసీబీ సిటీ రేంజ్-1 పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 11/ఏసీబీ-సీఆర్-1/2015 నమోదు చేశారు.
12 ఆఫ్ ప్రివెన్సన్ ఆఫ్ కర్సప్షన్ యాక్ట్, 1988, 120-బీ, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుగా స్టీఫెన్సన్ను, నిందితులుగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి (A 1), వికాసపురి కాలనీకి చెందిన బిషప్ సెబాస్టియన్ హ్యారీ, ఎర్రగడ్డకు చెందిన పాస్టర్ (A 2), నాగోల్లోని హరిపురి కాలనీకి చెందిన రుద్ర ఉదయ్సింహా (A 3), మతియాస్ జరూసలేం(A 4)గా చేర్చిన సంగతి తెలిసిందే.