ఇంటింటి సర్వేకి ఇతర జిల్లాల ఉద్యోగులు, విజయవాడ వరదలపై చంద్రబాబు ఆర్డర్
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేసి ఎంతెంత నష్టం జరిగింది అంటూ పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చెయ్యడానికి ఇతర జిల్లాల నుంచి రెవెన్యూ అధికారులు విజయవాడ చేరుకుంటున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 19 మంది తహసిల్దార్లు, 42 మంది రెగ్యులర్ డిప్యూటీ తహసిల్దార్ల, 67 మంది రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, 64 మంది వీఆర్ఓలు, 18 మంది రీసర్వే డీటీలు విజయవాడ చేరుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్న అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయడానికి రంగంలోకి దిగారు. ఇంకా కొంత మంది అధికారులు సోమవారం మద్యాహ్నం, సాయంత్రం విజయవాడ చేరుకునే అవకాశం ఉంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 210 మంది రెవెన్యూ ఉద్యోగులులు విజయవాడలో ఇంటింటి సర్వే చెయ్యాలని వారిని డిప్యూటేషన్ పై నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో వరద పీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ఎలా చెయ్యాలి అని రెవెన్యూ సిబ్బందికి విజయవాడలో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారని రెవెన్యు శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు సుమారు ఐదు రోజుల పాటు విజయవాడలోని వరదపీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చెయ్యనున్నారు. రెవెన్యూ శాఖతో పాటు విద్యుత్, ఎన్నికలు, భూసేకరణ, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయం, పౌరసరఫరాల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చెయ్యడానికి నియమిస్తున్నారని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications