జగన్ ముఖ్యమంత్రి అవుతాడు...రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుంది: విజయలక్ష్మి
కడప:"రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుంది, జగన్బాబు ముఖ్యమంత్రి అవుతాడు. తండ్రి మాదిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాడు"...అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి తెలిపారు.
ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా లో పాదయాత్ర కొనసాగిస్తున్న వైసిపి అధినేత జగన్ రాయవరం మండలం పసలపూడిలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

వైఎస్ఆర్...కారణజన్ముడు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి 69వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో వైఎస్ సతీమణి విజయలక్ష్మి, కుమార్తె షర్మిల, కోడలు భారతి, మాజీ ఎంపీ అవిషరెడ్డి, పురుషోత్తమరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...‘వైఎస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడు. దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుని సన్నిధికి చేరుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో స్ఫూర్తిదాయకంగా...రోల్మోడల్గా నిలిచారు. మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయాలో ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో చేసి చూపించారని విజయమ్మ కొనియాడారు. వైఎస్ను మంచి భర్తగా, మంచి రాజుగా, మంచి సీఎంగా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది హృదయాల్లో నిలిపినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
Recommended Video


తండ్రిలాగే...జగన్
తండ్రిలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజలకు మంచి చేయాలని పాదయాత్ర చేస్తున్నారని ఆమె వివరించారు. తండ్రికి ఉన్న ఉద్దేశాలు ప్రతీదీ నెరవేర్చాలని జగన్ కోరుకుంటున్నారని ఆమె వివరించారు. సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజల మధ్యలో ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా రాజన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు. అనంతరం విజయమ్మ రచించిన ‘నేను కాను.. క్రీస్తే'అన్న పుస్తక ఆవిష్కరణ జరిగింది.

జగన్@2500 కిలోమీటర్లు
ప్రజల ఆశీస్సులు, నాన్న దీవెనలే తనను నడిపిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రమే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి చేరుకున్న ఆయన రాయవరం మండలం పసలపూడిలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 69 కిలోల భారీ కేక్ను కట్ చేశారు. వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అలాగే జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం 208వ రోజున మండపేట నియోజకవర్గానికి చేరుకునేసరికి 2500 కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరుకోవడంతో పసలపూడి వంతెనకు ఎదురుగా మొక్కను నాటారు.

అప్పట్లో...బాబు కూడా అక్కడే
పసలపూడి నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర చెల్లూరు, మాచవరం, సోమేశ్వరం గ్రామాల మీదుగా 7.3 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ రాజన్నరాజ్యం వస్తోందని, కష్టాలన్నీ తీరుతాయని జగన్ భరోసా ఇచ్చారు. కాగా, 2013లో విపక్షనేతగా చంద్రబాబు చేపట్టిన ‘మీ కోసం వస్తున్నా' పాదయాత్ర కూడా ఆ ఏడాది మార్చి 25న 175 రోజులు పూర్తి చేసుకొని మండపేట చేరేసరికి 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరింది. ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర కూడా అక్కడే 2500 కిలోమీటర్ల మార్కును చేరుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications