తిరుత్తణిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఏపీ మెడికోలు మృతి
చిత్తూరు: తమిళనాడులోని తిరుత్తణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెడికోలు దుర్మరణం పాలయ్యారు. ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థులు కారులో తిరుపతి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు చేసుకున్న తర్వాత, వారు ప్రయాణిస్తున్న కారు తిరుత్తణి వద్ద అంబులెన్స్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో వైద్య విద్యార్థులు సుధీర్, శివకృష్ణ దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య
తిరుపతి నగరానికి సమీపంలోని నిర్జన ప్రదేశంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఈస్ట్ డీఎస్పీ కెవి మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి-రేణిగుంట రోడ్డులోని ఆటోనగర్ గోల్లవానిగుంట, కోదండపాణి లేఅవుట్ వద్ద ఉన్న నిర్జన ప్రదేశంలో గుర్తుతెలియని సుమారు 45 సంవత్సరాల వయసుగల వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది మృతుని ఆచూకీ కోసం సంఘటనా స్థలం సమీపంలో విచారించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి తలపై బలమైన ఆయుధంతోనో, రాతితో కొట్టడంతో తల ఛిద్రమైంది. మృతుని ఎడచేతి మణికట్టుపైన పి రాధ అని పచ్చబొట్టు ఉంది. చొక్కాపై సిటీమ్యాన్, నగరి అని టైలర్ షాపు పేరు ఉండడంతోపాటు పక్కనే ఓ ఆటోకు సంబంధించిన తాళాన్ని గుర్తించారు.
రాత్రి వేళ ఆటోలో తీసుకువచ్చిన కొంత మంది ఈ హత్యచేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నగరి ప్రాంతానికి చెందిన వాడై ఉండవచ్చునని అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి డాగ్స్క్వాడ్, క్లూస్ బృందాలను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. హత్యపై అలిపిరి సీఐ శ్రీనివాసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు.