అర్థరాత్రి బీభత్సం: మహీంద్రా షోరూంలో భారీ దోపిడీ
నగర శివారులోని మహీంద్ర షోరూమ్లో గురువారం సిబ్బంది విధులు ముగించుకుని కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. సెక్యూరిటీ గార్డులు సాలార్బాషా, పెద్దన్న షోరూం వద్ద కాపలా విధుల్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత కార్యాలయం ప్రహరీ వెనుక భాగం నుంచి శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డులు ఆ వైపు గస్తీ కోసం వెళ్లారు. దీంతో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు సెక్యూరిటీ గార్డులపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అలాగే వారి కాళ్లూ చేతులు కట్టేసి ఒక గదిలో బంధించారు.
అనంతరం వీరు ప్రహరీ వెనుక భాగంలోని షట్టర్ను గ్యాస్ కట్టర్ సాయంతో తొలగించి లోపలికి ప్రవేశించి కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లో దాచిన రూ. 14 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దోపిడీ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు కార్యాలయం ఎజిఎంతో పాటు, మేనేజ్మెంట్కు తెలిపారు. షోరూమ్ ఎజిఎం రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్లతో తనిఖీలు చేయించామని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డులు ఇచ్చిన సమాచారం మేరకు దుండగులు ఆ సమయంలో ఒకరితో ఒకరు తెలుగులో మాట్లాడినట్లు తెలిసిందన్నారు.
సిసి టివి ఫుటేజ్ స్వాధీనం
దోపిడీ జరిగిన తర్వాత దుండగులు అక్కడ ఉన్న సిసి టివి వీడియో ఫుటేజ్లను సైతం పట్టుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ ఉన్న సుమారు మూడు సిసి కెమెరా ఫుటేజ్లను దుండగులు తీసుకెళ్లారు. అయితే దొంగలకు కనపడని ఒకే ఒక సిసి టివి ఫుటేజ్లో మాత్రం వీరు దోపిడీకి పాల్పడిన విధానానికి సంబంధించిన వివరాలు నమోదై ఉన్నట్లు తెలిసింది. ఐదుగరు దుండగులు దోపిడీకి పాల్పడగా వీరి వయస్సు సుమారు 25-28 సంవత్సరాల వయస్సు ఉంటుందని గుర్తించినట్లు తెలిసింది.
వీరందరూ మాస్క్లు ధరించి షోరూంలో అటూ ఇటూ వేగంగా పరుగులు తీస్తూ క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లడం, డబ్బు తీసుకుంటూ లెక్క పెట్టుకోవడం లాంటి దృశ్యాలన్నీ పోలీసులకు దొరికిన సిసి టివి ఫుటేజ్లో లభ్యమైనట్లు తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఫుటేజ్లో దొరికిన ఆనవాళ్లతో నేరస్థులల జాడ తెలుసుకోవడానికి పాత నేరస్థులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తీవ్రతరం చేసినట్లు తెలిసింది.
ఘటనా స్థలంలో పోలీసుల నిఘా
ఈ విషయం తెలిసిన వెంటనే నగర వన్ టౌన్, టూ టౌన్, రాప్తాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ దోపిడీ జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో పాటు సిఐలు గోరంట్ల మాధవ్, మన్సూరుద్దీన్, శుభకుమార్, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకరరెడ్డి, శ్రీనివాసులు, జగదీష్, పోలీసు సిబ్బంది పరిసరాలను నిశితంగా గమనించారు.