జగన్ను తొలిసారి అప్పుడే కలిశా, సొంత చెల్లిలా...: రోజా
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా రక్షాబంధన్ పర్వదినం సందర్బంగా పార్టీ అధినేత రోజాతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. జగనన్నను మొట్టమొదటిసారి వైయస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కలిశానని ఆమె చెప్పారు. అప్పటి నుంచి జగన్ తనను సొంత చెల్లిలా భావించారని, అది తన అదృష్టమని ఆమె తెలిపారు.
విజయలక్ష్మిని తాను అమ్మా అని పిలుస్తానని, ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని రోజా చెప్పారు. తనను ఒక పార్టీ ఎమ్మెల్యేలా కాకుండా సొంతమనిషిగా జగనన్న కుటుంబం భావించిందని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ కుట్ర పన్ని తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు నిషేధించినా కూడా జగనన్న అండగా నిలబడ్డారని ఆమె తెలిపారు.

అప్పటి నుంచి జగన్ను సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తున్నట్లు రోజా చెప్పారు. తనతో జగనన్న ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలోని మహిళా ఎమ్మెల్యేల్లో రోజాను ఫైర్ బ్రాండ్గా చెబుతారు. తన పదునైన వ్యాఖ్యలతో ఆమె సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయాల్లోనే కాకుండా టీవీ షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె రక్షా బంధన్ సందర్భంగా వైసీపీ అధినేత జగన్తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.












Click it and Unblock the Notifications