రూల్స్ బ్రేక్.. తిరుమల కొండపై వివాదాస్పద రీతిలో రోజా..
తిరుమల కొండపై రాజకీయాలు నిషిద్ధం కాగా.. మీడియా సమావేశంలో ఆమె రాజకీయాలు ప్రస్తావించి వివాదానికి తెరలేపినట్లుగా సమాచారం.
తిరుపతి: వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమల కొండపై వివాదస్పద రీతిలో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. తిరుమల కొండపై రాజకీయాలు నిషిద్ధం కాగా.. మీడియా సమావేశంలో ఆమె రాజకీయాలు ప్రస్తావించి వివాదానికి తెరలేపినట్లుగా సమాచారం.
కాగా, నేటి ఉదయం రోజా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్బంగా రోజా రాజకీయాల గురించి ప్రస్తావించబోయారు. అయితే పక్కన్నే ఉన్న టీటీడీ జేఈవో ఆమెను వారించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.
అయితే అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లాక, రోజా నిబంధనలను ఖాతరు చేయకుండా జీఎన్సీ టోల్ గేట్ వద్ద మీడియాతో రాజకీయాల గురించి మాట్లాడారు.ఏపీ పోలీసులతో పాటు టీడీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పక్కన్నే విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని చూసీ చూడనట్లు వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి.
కాగా, ఎమ్మెల్యే రోజా క్షమాపణలు చెప్పాలంటూ ఏపీ పోలీస్ అసోసియేషన్ చేసిన డిమాండ్ ను రోజా తప్పుబట్టారు. క్షమాపణలు కోరే ముందు ఒకసారి తమ ప్రవర్తనను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.