ప్యాకేజీ రాయుడు, సోనియా కోసం ఇటిలీ: బాబుపై రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీ రాయుడుగా మారారని ఆమె విమర్శించారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ఇటప్పటికీ స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోసం ఇటలీ భాష నేర్చుకుని మాట్లాడిన చంబ్రాబు నోటినుంచి సమైక్యమన్న తెలుగు పదం ఎందుకు రావడం లేదని రోజా ప్రశ్నించారు. గాయం చేయమని కత్తిచ్చి.. న్యాయం చేయమని అడిగినట్లు.. చంద్రబాబు తీరు ఉందని ఆమె ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్యాకేజీ నాయుడుగా మారారని ఆమె ఎద్దేవా చేశారు.
సీమాంధ్ర రాజధాని ఏర్పాటు కోసం ప్యాకేజీ కావాలని చంద్రబాబు గతంలో ప్రస్తావించిన విషయం తెలిసిందె కదా అని ఆమె అన్నారు. విభజన కోసం కుమ్మక్కైన చంద్రబాబు మళ్లీ ఎందుకోసం యాత్రలు చేపడుతున్నారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి రాష్ట్నాన్ని సమైక్యంగా ఉంచే దిశగా కృషి చేయాలని చంద్రబాబుకు సూచించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ పిలుపుతో సీమాంధ్ర వ్యాప్తంగా ప్రజలు రహదారుల దిగ్బంధాన్ని చేపట్టారని రోజా తెలిపారు. తమ పార్టీ పిలుపుకు ప్రజలు మద్దతు పలికుతూ భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారని ఆమె అన్నారు. కాగా రహదారుల దిగ్భంధనం చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు పలు చోట్ల అరెస్ట్ చేశారు.