జబర్దస్త్: ద్వంద్వార్థాల హాస్యానికి రోజా బాసట
హైదరాబాద్: ఇటీవల తెలుగు టీవి చానెళ్లలో అదరగొడుతున్న కార్యక్రమాల్లో జబర్దస్త్ అత్యంత ముఖ్యమైంది. అది తెలుగు టీవీ ప్రేక్షకులను అదరగొడుతోంది. అయితే, ఆ కామెడీ షోలో ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు ఉంటున్నాయి. కొంత అశ్లీలతను జోడించి, హాస్యాన్ని పుట్టించే సంఘటనలు ఎపిసోడ్స్లో చోటు చేసుకుంటున్నాయి.
దానికితోడు, పురుషులు ఆడ వేషాలు వేస్తూ హాస్యాన్ని కాస్తా ద్వంద్వార్థాలతో పండిస్తున్నారు. ఈ కామెడీ షోకు ప్రముఖ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా, ప్రముఖ నటుడు నాగబాబు జడ్డీలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే, ద్వంద్వార్థాలతో కూడిన హాస్యాన్ని రోజు సమర్థిస్తున్నట్లు చెబుతున్నారు. షో హిట్టయినప్పుడు అది పెద్ద సమస్య కాదని ఆమె అంటున్నట్లు ప్రచారం సాగుతోంది. సినిమాల్లో వాడినప్పుడే అటువంటి సన్నివేశాలకు, సంభాషణలకు అభ్యంతరం చెప్పాల్సి ఉండిందని రోజా అంటున్నారట.
సినిమాల్లో వాడితే అభ్యంతరం లేనప్పుడు టీవీ షోల్లో వాడితే తప్పేమిటని, అయినా అవి వెగటు పుట్టించే విధంగా లేవని, హాస్యం మాత్రమే పుట్టిస్తున్నాయని ఆమె సమర్థిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. పాత సినిమాల్లో కూడా హాస్యం పుట్టించడానికి ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు వాడిన సందర్భాలు ఉన్నాయని ఆమె వాదిస్తున్నట్లు చెబుతున్నారు.