చంద్రబాబుపై రోజా 'జబర్దస్త్' కామెంట్స్: టిడిపిని ముంచడానికేనా?
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు, ఓ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రోజా తన వ్యాఖ్యలు టిడిపిలో చేరుతున్నవైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి.
చంద్రబాబుపై రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఫిరాయింపుదారులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల టిడిపికే నష్టమని, ఎంత ఎక్కువ మంది చేరితే ఆ పార్టీ అంత తొందరగా మునిగిపోతుందని రోజా అన్నారు.
చంద్రబాబునాయుడుకు వయసు అయిపోయిందని, ఆయనకు చూపు కూడా మసకబారిపోయిందని ఆమె అన్నారు. పార్టీ మీద పట్టు సన్నగిల్లిపోయిందని తన వైఫల్యాల మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని రోజా అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
వెళ్లిపోయిన వారు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఒక పార్టీ పెట్టి, ఒక సీటు అయినా సాధించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ అవినీతి అంతా దోచుకుంటున్నారని, అవినీతిలో వారు డబుల్ డిజిట్ సాధించారని ఆమె ఆరోపించారు.