ఎపిలో విద్యుత్ పనులకు రూ.29,000 కోట్ల రుణం:కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 28,968 కోట్ల రూపాయల రూపాయలతో 246 పనులు జరుగుతున్నట్లు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్ పివి రమేష్ వెల్లడించారు. ఎపి విద్యుత్ అవసరాలకు తాము భారీగా రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పివి రమేష్ తెలిపారు.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన సందర్భంగా కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్ పివి రమేష్ మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రలో తాము ఇస్తున్న రుణాల వల్ల అనేక పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే 11,388 కోట్ల రూపాయలను వివిధ పనులకు పంపిణీ చేసినట్లు వివరించారు. గడచిన 5 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎపికి ఇప్పటివరకు రూ. 60,000 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు రమేష్ వెల్లడించారు.

తమ సంస్థ ద్వారా ఏపిలో జరుగుతున్న వివిధ విద్యుత్ అభివృద్ది పనుల వివరాలను పివి రమేష్ వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరుగుతున్న పనులకు సంబంధించి ట్రాన్స్కో ద్వారా 105 పనులకు రూ.10,303 కోట్లు, జెన్కో ద్వారా మూడు పనులకు గాను రూ.10,745 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు రమేష్ వెల్లడించారు. అలాగే ఎపిపిడిసిఎల్ ద్వారా ఒక పనికి రూ.1500 కోట్లు, ఎపిఎస్పిడిసిఎల్ ద్వారా 129 పనులకు రూ.5733 కోట్లు, ఎపిఇపిడిసిఎల్ ద్వారా ఐదు పనులకు రూ.644 కోట్లు, రెస్కోల్లో మూడు పనులకు 43 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎపికి ఇప్పటివరకు రూ. 60,000 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు రమేష్ చెప్పారు. 2013-14లో రూ.14,525 కోట్లు, 2014-15లో 5947 కోట్లు, 2-15-16లో 8395 కోట్లు, 2016-17లో 17,405 కోట్లు, 2017-18లో 10,475 కోట్లు చొప్పున రుణాలు విడుదల చేసినట్లు వివరించారు. అలాగే భిన్నమైన
రంగాలకు కూడా రుణాలు మంజూరు చేశామన్నారు. రాజధాని నిర్మాణం లో విద్యుత్ పనులకు రూ.17,000 కోట్లు ఇచ్చామని, రాజధాని నిర్మాణ ప్రారతంలో విద్యుత్ లైన్ల మార్పిడి, కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, భూగర్భ విద్యుత్ విధానం అమలు వంటివి ఈ రుణాలతోనే అమలు జరుగుతున్నట్లు చెప్పారు.
మరోవైపు పోలవరం నిర్మాణంలో భాగంగా హైడ్రో విద్యుత్ కేంద్రానికి 4,200 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చామన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల నిర్మాణం, 24/7 విద్యుత్ సరఫరా అమలు, వివిధ ప్రాంతాల్లో సౌర, గాలి విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం కూడా తమ సంస్థ రుణాలు ఇచ్చినట్లు రమేష్ చెప్పారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్లో విద్యుత్ అవసరాల పనులకు మరో రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
ఇటీవలే రాష్ట్రంలో విద్యుత్ బస్సుల నిర్వహణకు తాము ప్రతిపాదనలు కోరగా ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం దీనిపై తమ సంస్థతో చర్చించిందని, వారి ప్రాథమిక ప్రతిపాదనకు అవసరమైన రుణం ఇచ్చేందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేశామని రమేష్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆర్టీసీని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ రంగానికి ఇస్తున్న రుణాలే కాకుండా ప్రయివేటు రంగంలో కూడా విద్యుత్ కోసం భారీగా రుణాలు ఇస్తున్నట్లు పివి రమేష్ చెప్పారు. పవన, సౌర విద్యుత్ సంస్థల ఏర్పాటుకు అనేక మంది అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ముందు కొస్తున్నారని, వారికి తమ సంస్థ తరఫున రుణాలు ఇస్తున్నామని రమేష్ వివరించారు.












Click it and Unblock the Notifications