చూపిస్తాం: శైలజానాథ్Vsడికె అరుణ, కెసిఆర్పై లోకేష్
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో కాంగ్రెసు పార్టీ మంత్రులు డికె అరుణ, శైలజానాథ్ల మధ్య సోమవారం ఆసక్తికర చర్చ జరిగింది. ఇంతకాలం తాము ఓపిక పట్టామని, తమను మోసం చేశారని, ఇకపై తామేంటో చూపిస్తామని శైలజానాథ్ అన్నారు. అంతేకాకుండా అసహనంతో చేతిలో ఉన్న పేపర్లను నేలకేసి కొట్టారు. దీనిపై స్పందించిన డికె అరుణ.. మీరు మా ఊరి మీది నుండే మీ ఊరికి వెళ్లాలని చమత్కరించారు.
స్వాగతిస్తున్నాం: మోత్కుపల్లి
శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ బిల్లు పైన పెద్దగా చర్చించేదేమీ లేదన్నారు. సభలో చర్చను వారం రోజుల్లో ముగించి రాష్ట్రపతికి బిల్లు ముసాయిదాని పంపించారన్నారు.
బిల్లును చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లును చించి వేసిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. సభా నియమాలను ఉల్లంఘించారని వారు సభలో ఉండేందుకు అర్హత లేదని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. ఈ మేరకు సభ్యుల సభ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు.
కెసిఆర్కు నారా లోకేష్
తెలంగాణలో అభివృద్ధి పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చర్చకు భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తెలంగాణపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు.