సజ్జలతో పాటు ప్రభుత్వ సలహాదారుల మూకుమ్మడి రాజీనామాలు; టీటీడీ ఛైర్మన్ భూమన రాజీనామా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలలో కూడా వైసిపి ఘోర పరాజయం చెందింది. ఏపీలో 151 సీట్లు గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పిన వైసీపీ నేతలు, ఏపీలో సైలెంట్ ఓటింగ్ తమకే పడిందని బలంగా నమ్మిన నేతలు నిన్న ఓటర్లు ఇచ్చిన 11 సీట్ల తీర్పుకు ఖంగుతిన్నారు. ఊహించని ఈ ఫలితాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయ్యారు.
వైసీపీ ఓటమితో ఏపీ ప్రభుత్వ సలహాదారుల రాజీనామా
ఇక ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు జరగనున్న నేపధ్యంలో వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సిఎస్ జవహర్ రెడ్డి కి పంపించారు.

20 మందికి పైగా సలహాదారులు రాజీనామా
సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి కి లేఖలు పంపించారు. గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న, వైయస్ జగన్ ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులు వైసిపి ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు.
టీటీడీ చైర్మన్ భూమన రాజీనామా
జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జి వి డి కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శామ్యూల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను సమర్పించగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు.
తనను రిలీవ్ చెయ్యమన్న సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్
కాగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వానికి తన రాజీనామా పంపి తనని రిలీవ్ చెయ్యాలని దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు తన పదవీ కాలాన్ని పొడిగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఇప్పుడు తనను రిలీవ్ చేయమంటూ దరఖాస్తు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications