పవన్ కళ్యాణ్లా చంద్రబాబు!: అంత బరితెగింపా అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కర్నూలు పర్యటనలో చంద్రబాబు విన్యాసాలు ప్రజలంతా చూశారన్నారు. సీఎం, పార్టీ నేలతోపాటు చివరకు ప్రజల మీద కూడా బూతుల దాడి చేశారని మండిపడ్డారు.

పవన్లా చంద్రబాబు అంటూ సజ్జల
చంద్రబాబుకు ఎందుకింత కోపం వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మద్య పూనకం వచ్చినట్లు ఊగిపోయారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్లా చెప్పు చూపించాలని కోరిక ఉన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. న్యాయ రాజధానిపై మీ విధానం ఏంటి అని రాయలసీమ ప్రజలు, పౌర సమాజం చంద్రబాబును నిలదీసిందని.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

ఉమ్మడి ఏపీ విభజన అంత చేదుగా ఉండేది కాదన్న సజ్జల
అమరావతిలోనే కేంద్రీకృత రాజధాని ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది కానీ.. ఆయన మాత్రం ఊగిపోయారని మండిపడ్డారు సజ్జల. ఉమ్మడి ఏపీలో కూడా వికేంద్రీకరణ అభివృద్ధి జరిగివుంటే రాష్ట్ర విభజన ఇంత చేదుగా ఉండేది కాదన్నారు. అమరావతిలో చంద్రబాబు చెప్పే లక్ష కోట్ల రాజధాని కట్టడం అసాధ్యమని అన్నారు. అమరావతి ఒక భ్రమ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు అంత బరితెగింపా?: సజ్జల
రౌడీలకు రౌడీని అనే వ్యాఖ్యలు ఏంటి? చంద్రబాబుకు అంత బరితెగింపు ఏంటి? అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అంటే తిట్లు, దూషణలు, పచ్చి బూతులు అని కొత్త నిర్వచనం ఇచ్చారు. వాళ్లే దాడి చేసి వాల్లే బట్టలు చించుకుని బయటకు వచ్చి అరుస్తారని మండిపడ్డారు. ఒక చిట్ ఫండ్స్లో అక్రమాలను పట్టుకుంటే కక్ష సాధింపు అంటారు.. మీరు అన్నింటికీ అతీతమా? అని ప్రశ్నించారు.

ఇదేం కర్మరా ‘బాబూ'అంటూ సజ్జల ఎద్దేవా
వచ్చే ఎన్నికలు ప్రజలకు చివరి అవకాశమని మాట్లాడుతున్నారు.. ఇదేం కర్మ రా బాబు అని చెబితే సరిగ్గా సరిపోతుంది.. తన హయాంలో ప్రజలకు మంచి పనిచేసుంటే అదే చెప్పుకోవచ్చు. ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సజ్జల. అమరావతిలోనే రాజధాని ఉండాలని వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు సజ్జల. అప్పుడు చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం రాజధాని పూర్తి చేసి ఉంటే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుని ఉండేవారన్నారు సజ్జల. రాష్ట్ర బడ్జెట్ అంతా ఈ 29 గ్రామాల్లోనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటల్లోనే అహంకారం కనబడుతోందని.. అన్ని పార్టీలు కలిసి ఆయనకే పట్టం కట్టాలా? అని నిలదీశారు సజ్జల. చంద్రబాబు అసలు వికేంద్రీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications