చిరంజీవి కారుకు అడ్డంపడ్డారు: జెపిని నిలదీసిన వైనం
కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్ర సమితి కార్యకర్తలు ఆయన కారుకు అడ్డుపడ్డారు. దీంతో ఆయన కారు దిగి కార్యకర్తల వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నాలు చేశారు. తాను రాజీనామా చేస్తే విభజన ఆగిపోతుందంటే ఆ పని చేసేందుకు సిద్ధమన్నారు.
జెపికి రెండు ప్రాంతాల్లో సెగ
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలనూ పరిరక్షిస్తూ ప్రస్తుత సంక్షోభానికి సామరస్య పరిష్కారం సాధించే లక్ష్యంతో 'తెలుగు తేజం' యాత్ర చేపట్టిన లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆయన యాత్ర ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రల్లో ఏకకాలంలో వివాదాస్పదమైంది. సీమాంధ్రలోని ఉద్యోగ సంఘాలు తెలంగాణ నేతలు జెపి వైఖరిపై మండిపడ్డారు.
తెలుగుతల్లి విగ్రహం వద్దనే యాత్రకు శ్రీకారం చుట్టి, తెలుగు తల్లికి పూలమాల వేయకపోవడాన్ని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జై సమైక్యాంధ్ర అనాలని డిమాండ్ చేశారు. ఇక సీమాంధ్రలో జెపి యాత్రను తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ తప్పుబట్టారు. లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని, ఆంధ్రా నాయకుల కన్నంతా సీమాంధ్రవైపే అని కెసిఆర్ చెప్పినట్టు.. చంద్రబాబు, విజయలక్ష్మి, చివరకు జెపి కూడా ఇప్పుడు ఆంధ్రా ఉద్యమానికి అండగా వెళ్లారని విమర్శించారు.
అయితే, జెపిపై రెండు ప్రాంతాల్లోనూ దుష్ప్రచారం చేయడం దారుణమని లోక్సత్తా ఉపాధ్యక్షుడు డివివిఎస్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో తెలుగు తేజం సభలో కొందరు అలజడి సృష్టించడం, అదే సమయంలో జెపి వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు వక్రభాష్యం చెప్పడాన్ని ఆయన ఖండించారు. విభజన ప్రక్రియలో హైదరాబాద్ కంటే రాయలసీమ భవిష్యత్తు ప్రధానమని, రాయలసీమ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడాలని జెపి అన్నారు.
లోక్సత్తా ఆధ్వర్యంలో 'తెలుగు తేజం' పేరిట సీమాంధ్రలో చేపట్టిన యాత్రను కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద శనివారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు మాంటిస్సోరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జెపి మాట్లాడారు. నిరసనలు తెలపడం సమంజసమేనని కానీ, బంద్లు చేయడం సరికాదన్నారు. ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటామా? అని ప్రశ్నించారు. తెలంగాణ బందు సమయంలో కూడా తాను ఖండించానని చెప్పారు.
అందరి ప్రయోజనాల కోసం ఢిల్లీపై దండెత్తాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి రాజకీయ పార్టీలు ఆడిన వికృత రాజకీయమే కారణమన్నారు. కాగా, కర్నూలులోనే జయప్రకాశ్ నారాయణ్కు సమైక్య సెగ తగిలింది. వాస్తవానికి, ఆయన తన తెలుగు తేజం యాత్రను తెలుగు తల్లి విగ్రహం వద్ద నుంచే ప్రారంభించారు. అయితే, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేయకపోవడంతోపాటు నిరసనలు మాత్రమే తెలుపుకోవాలని, బంద్లు చేయడం తప్పని వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు.
ప్రసంగాన్ని ఆపకపోవడంతో లౌడ్ స్పీకర్ కనెక్షన్ తొలగించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని పట్టుబట్టారు. దీంతో సభ తర్వాత జరగాల్సిన రోడ్ షోను రద్దు చేసుకున్న జెపి, ప్రభుత్వ అతిథిగృహానికి వెళ్లిపోయారు. సమైక్యాంధ్ర నేతలు అక్కడికి వెళ్లి జెపి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు తేజం పేరుతో యాత్రలు చేస్తూ తెలుగు తల్లిని గౌరవించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణవాదులు సమ్మెలు చేసినప్పుడు జెపికి తప్పని గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. కాగా, అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ... తాను అదిలాబాదులో ఓ మాట, అనంతపురంలో ఓ మాట చెప్పడం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాలేదన్నారు.