అచ్చం తండ్రి వైయస్ లాగే..! పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణంలోకి జగన్..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : కష్టపడు.. ఫలితం దానంతట అది నీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతుంది అనే సిద్దాంతాలన్ని వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి బాగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో దాదాపు అన్ని పార్టీల నేతలు సరదాగా కుటుంబంతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పుడు రెస్ట్ మోడ్ లోకి వెళ్లి పోయినట్టు సమాచారం.

2004లో వైయస్ఆర్ అదే చేసారు..! ఇప్పుడు అదే బాటలో జగన్..!!
రెండేళ్లుగా పాదయాత్ర, ఎన్నికల ప్రచారంతో జగన్ ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. ఎన్నికల తర్వాత కూడా ఐదు రోజుల పాటు జిల్లాల్లో పోలింగ్ సరళిపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ఇక, ఇప్పుడు విజయంపై ధీమాగా ఉన్న జగన్ హాలీడేకు వెళ్లనున్నారు. నెల రోజుల పాటు ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు.

హోరాహోరీగా జరిగిన ఎన్నికలు..! స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమైన నేతల భవిత..!!
ఎన్నికల్లోనే కాకుండా ప్రచారంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్ ఒకరికొకరు పోటీ పడ్డారు. మొదటి విడతలో ఎన్నికలు జరగడం, ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత ఆందోళనగా కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఎన్నికల నిర్వాహణలో ఈసీ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..! అందుకు విరుద్దంగా ప్రతిపక్ష నేత..!!
ఢిల్లీ వెళ్లి ఆయన ఇదే విషయమై వివిధ పార్టీల నేతలను కలిసి గళం విప్పారు. అంతేకాదు కర్ణాటక, తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. తనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి వచ్చిన వారి తరపున ఇప్పుడు ఆయన వారి రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనూ చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు బిజీగానే గడుపుతుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పూర్తిగా హాలీడే మూడ్ లోకి వెళుతున్నారు.

దేవుడు దయతలిస్తే..! జగన్ నోటీ వెంట పదే పదే అదే మాట...!!
వైసీపీ శ్రేణులపై టీడీపీ జరిపిన దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన జగన్ ఇక నెల పాటు పార్టీ వ్యవహారాలకు, మీడియాకు దూరంగా ఉండనున్నారు. జాతీయ రాజకీయాలపై కూడా జగన్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తనకు కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా సంబంధం లేదని, ఎన్నికల ముందునుంచే తాము ఎవరితోనూ కలవమని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించిన వారికే వైసీపీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలనూ ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. నెల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications