కాల్మనీ దారుణం, రాడ్లతో కొట్టారు: స్మగ్లర్ భార్య సంగీత కోసం వెయిటింగ్!
విజయవాడ/హైదరాబాద్: కృష్ణా జిల్లాలో మరోసారి కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. తమ దగ్గర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని ఇనుప రాడ్లతో ఓ పూజారి పైన దాడి చేశారు. పూజారీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సంఘటన మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పవన్ పూజారిగా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వనవలయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి లక్ష రూపాయల అప్పు తీసుకున్నాడు.
అసలు, చక్ర వడ్డీతో కలిపి అప్పు రూ.4 లక్షలకు చేరుకుంది. ఇందులో సదరు పూజారీ చాలా మొత్తం చెల్లించారు. వడ్డీ మరీ ఎక్కువ కావడంతో కొంత అప్పు అలాగే మిగిలిపోయింది. అయితే, ఆదివారం రాత్రి పవన్ రేపల్లె నుంచి మోపిదేవి వస్తుండగా వ్యాపారి వనవలయ్య పూజారీ పైన దాడికి పాల్పడ్డాడు. అతను అవనిగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సంగీతా ఛటర్జీ కోర్టుకు హాజరయ్యేనా?
ఎయిర్ హోస్టెస్గా పని చేసి, ఆ తర్వాత మోడల్గా మారి.. అనంతరం ఎర్ర చందనం స్మగ్లర్గా ఆపరేషన్ రేడ్లో పోలీసులకు దొరికిన సంగీత ఛటర్జీ సోమవారం నాడు చిత్తూరు కోర్టుకు హాజరయ్యే అవకాశముంది. ఈమె ఎర్ర చందనం స్మగ్లర్ లక్ష్మణ్ భార్య.
ఆమె ఈ రోజుకు కోర్టుకు హాజర కావాల్సి ఉంది. ఆమె కోసం పోలీసులు కోర్టు వద్ద వేచి చూస్తున్నారు. ఆమె వస్తారా లేదా తెలియాల్సి ఉంది. పోలీసులు సాయంత్రం దాకా వేచి చూడనున్నారు. అలాగే, ఆమె కోర్టుకు వచ్చాక బెయిల్ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాదులో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు బీమవరంకు చెందిన వారు ఉన్నారు. బీమవరంకు చెందిన ఇద్దరు హైదరాబాదులో మకాం వేసి, బెట్టింగులకు పాల్పడ్డారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ రాయళ్లను, పంటర్స్ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.