లిక్కర్ కేసులో జగన్ కేంద్రంగా, కీలక పరిణామాలు: అప్రూవర్ రెడీ.. తెర వెనుక..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ కేంద్రంగా కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారుతోంది. జగన్ అంతిమ లబ్దిదారుగా చెబుతున్నారు. దీంతో.. ఈ కేసులో తదుపరి అడుగులు.. చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముందుగా ఈ కేసు పైన విచారణ మొదలు పెట్టింది. సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని అరెస్ట్ చేసారు. కాగా.. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేుకుంది. మద్యం కుంభకోణంలో అసలు లబ్ధిదారు నాటి సీఎం జగన్మోహన్రెడ్డేనని అప్పటి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. జగన్ ఇంట్లోనే ఈ స్కాం స్కెచ్ వేశారని.. ఆయనకు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, బాలాజీ గోవిందప్ప తదితరుల ద్వారా రూ.3,200 కోట్ల ముడుపులు అందాయని వెల్లడించారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారతానని సత్యప్రసాద్ పిటిషన్ దాఖలు చేసారు. ఆయన వాంగ్మూలాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి నమోదు చేశారు. అనంతరం విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు.

కోర్టులో వాంగ్మూలం.. కీలక అంశాలు
అయితే, ఇప్పటికే ఈ కేసులో 40 మంది నిందితుల ప్రమేయంపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సత్యప్రసాద్ తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో పలువురు న్యాయ వాదులు, సిట్ అధికారుల సమక్షంలో ఐదు గంటల పాటు న్యాయమూర్తికి లిక్కర్ స్కాం వివరాలను వెల్లడించారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో లిక్కర్ పాలసీని ఖరారుచేశారని చెప్పుకొచ్చారు. ఈ భేటీలో విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, కసిరెడ్డి, సుమిత్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. సేల్స్ డేటాను పరిశీలిస్తే.. నెలకు 50-60 కోట్ల ముడుపులు అంది ఉండొచ్చొని అభిప్రాయపడ్డారు. ఈ ముడుపుల వసూళ్లు చూడాలని నాకు, వాసుదేవరెడ్డికి ఆదేశాలు అందాయని వివరించారు. మద్యం ఎగుమతి, దిగుమతులు, రవాణా, నష్టాలు తదితర బాధ్యతలన్నీ తమకే ఇచ్చారని చెప్పారు. ఏ-1 రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి బ్రాండ్ల సరఫరా ఖరారుచేసేవారని వివరించారు. ఏ బ్రాండ్కు ఆర్డర్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వకూడదనే విషయాన్ని కసిరెడ్డి గ్యాంగ్ చూసుకునేవారని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు ఈ కేసులో తదుపరి విచారణ.. చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
