ఏపీలో స్కూళ్లు రీఓపెన్ తేదీ ఇదే- అదే రోజు విద్యా కానుక పంపిణీ: ఒక్కో కిట్లో
అమరావతి: ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ వచ్చేసింది. వేసవి సెలవులను ముగించుకుని.. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పూర్తి చేసింది. రీఓపెన్ అయ్యే సమయానికి స్కూళ్లల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, తొలి రోజు నుంచే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
పాఠశాలలు పునః ప్రారంభమౌతోన్న నేపథ్యంలో- ఈ నెల 12వ తేదీ నాడే స్టూడెంట్లందరికీ జగనన్న విద్యా కానుక కింద కిట్ల పంపిణీని చేపట్టనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. దీనికోసం ఆయన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని క్రోసూరులో బహిరంగ సభలో పాల్గొనున్నారు.

జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్లకు అందజేసే ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు. ఒక్కో కిట్లో మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా కిట్స్ ద్వారానే అందజేస్తుంది ప్రభుత్వం. ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోంది.
ఈ విద్యా సంవత్సరం కానుకను జగన్ క్రోసూరులో ప్రారంభించనున్నారు. జగనన్న గోరుముద్ద కింద రాగి జావను కూడా ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీన అమ్మఒడి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ నిధులను తల్లుల అకౌంట్లలోకి జమ చేస్తారు.
ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను మంజూరు చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో ఒకటి ప్రత్యేకంగా విద్యార్థినుల కోసం కేటాయిస్తామని అన్నారు. నాడు- నేడు పథకం కింద మొదటి విడతను పూర్తి చేసుకున్న పాఠశాలల్లో డిజిటల్ బోధనను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులకు టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications