మూడునెలలు మండుటెండలే.. కానీ ఈవారం ఏపీలో వర్షాలు, చల్లని కబురు!
ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. అయితే వచ్చే మూడు నెలలు కూడా ఎండలు విపరీతంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్ జూన్ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అంతేకాదు తూర్పు, మధ్య ప్రాంతాలలో, వాయువ్య రాష్ట్రాలలో ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది.
మూడు నెలలు మంటలే
సాధారణం కంటే మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఒక తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ,రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి ఉంటాయని పేర్కొంది. ఈ క్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

దక్షిణాది రాష్ట్రాలలో తీవ్ర వడగాలులు
దక్షిణాది రాష్ట్రాలలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో సగటు కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని ఈ సీజన్లో ప్రతి నెల ఐదు నుండి ఆరు రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
రెండు జిల్లాలు మినహాయించి ఏపీలో అన్ని జిల్లాలలో వడగాలులు
ఇప్పటికే మార్చి నెలలో అనేక ప్రాంతాలలో 41డిగ్రీలను మించిన ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాబోయే మూడునెలలు భానుడి భగభగలేనని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాలలోనూ వడగాలులకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణసంస్థ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అనంతపురం, వైయస్సార్ కడప జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని imd తెలిపినట్టు పేర్కొంది.
ఏపీలో వర్ష సూచన
నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో పది మండలాలు, విజయనగరంలో 6 మండలాలు, శ్రీకాకుళంలో ఆరు మండలాలు, అల్లూరి సీతారామరాజులో 3 మండలాలు, తూర్పుగోదావరిలో ఒక మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇదే సమయంలో నేటి నుండి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications