కేశినేని విజ్ఞప్తి, రజనీకాంత్ ఇచ్చారు: 12మంది ఐపీఎస్లు, 14వేల పోలీస్
విజయవాడ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు బస్సులు పంపించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి మేరకు ఆయన బస్సులు పంపించారు. రజనీకాంత్ తాను వ్యక్తిగతంగా ఉపయోగించే బస్సులను పంపించారని తెలుస్తోంది.
అమరావతి సంరంభానికి తరలి వచ్చే వివిఐపీల కోసం ఈ బస్సులను పంపినట్లు రజనీకాంత్ తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వివిఐపీలను అమరావతికి చేరవేసేందుకు ఈ బస్సులను వినియోగిస్తారు. బుధవారం బస్సులు చేరుకుంటాయన్నారు. ఈ వేడుకకు రజనీకాంత్ హాజరవుతారా లేదా తెలియాల్సి ఉంది.
తన విజ్ఞప్తి మేరకు రజనీకాంత్ చెన్నై నుంచి రెండు బస్సులను పంపించగా.. ఎంపీ కేశినేని నాని మరో పది ఏసీ బస్సులను సిద్ధం చేశారు. వీటిని అమరావతికి విఐపీలను, వివిఐపీలను చేరేవేసేందుకు ఉపయోగిస్తారు.
టిడి జనార్ధన్కు చేదు
అమరావతి శంకుస్థాపనకు ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మాజీ సీఎం నాదెండ్ల మనోహర్ ఇంటికి వెళ్లిన టిడిపి నేత టిడి జనార్ధన్కు చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది. తన గన్మెన్కు ఆహ్వాన పత్రిక ఇచ్చి వెళ్లాలని జనార్ధన్కు నాదెండ్ల సూచించారని, ఆయన అలాగే చేశారని తెలుస్తోంది.

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం
అమరావతి పరిసర ప్రాంతాల్లో సిఎం చంద్రబాబు బుధవారం విహంగ వీక్షణం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో శంకుస్థాపన జరిగే ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టి, నీరుని అమరావతి ప్రాంతంలో చల్లారు. మంత్రి నారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉద్ధండరాయనిపాలెంలో నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పనులన్నీ పూర్తి కావటంతో బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం దృష్టిసారించింది.
14 వేల మంది పోలీసులను వివిధ ప్రాంతాల నుంచి పిలిపించారు. 12 మంది ఐపీఎస్లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. మూడు వేల మంది వరకు వీఐపీలు హాజరుకానున్నారు. ప్రధాని, ఇతర ప్రముఖుల కోసం ఏడు హెలిప్యాడ్లు నిర్మించారు.
ఒక ప్రధాన వేదిక, ఒక సాంస్కృతిక వేదిక, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసీనులయ్యేందుకు మరో వేదిక నిర్మించారు. అలాగే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ దాదాపు 24వేల మంది కూర్చోవడానికి వీలుగా ప్రధాన గ్యాలరీ నిర్మాణం పూర్తి చేశారు.
కార్యక్రమం అంతా ప్రజలకు కనిపించేలా సభాప్రాంగణంలో పదిహేను ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక, సభాప్రాంగణం మొత్తాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. రాజధాని శంకుస్థాపన సందర్భంగా సేవలందించేందుకు తుళ్లూరు, పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 2వేల మంది యువకులను సమీకరించారు.
జగన్ దసరా శుభాకాంక్షలు
‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగ దసర. లోకాన్ని రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ, శాంతులను ఇవ్వాలి. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి' అని వైసిపి చీఫ్ జగన్ ఆకాంక్షించారు. దసరా పండగ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications