చంద్రబాబును వెంటనే మెంటల్ ఆస్పత్రికి పంపండి, నరకంలోనూ చోటు దొరకదు: సభలో జగన్ ఆగ్రహం
అమరావతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు రెండో రోజైన మంగళవారం కూడా వాడీవేడిగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్పష్టంగా మేనిఫెస్టో అన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడుకు నరకంలో కూడా చోటు దొరకదని తీవ్రంగా మండిపడ్డారు.

చంద్రబాబును అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో చేర్చాలి..
పేదలకు పక్కా ఇళ్లు(టిడ్కో)పై సభలో చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, ప్రజలకు హానికరం.. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు లభించదని జగన్ ధ్వజమెత్తారు. జగన్ మాట ఇస్తే చేసి చూపిస్తాడని అన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజల్లో ఇవ్వగలిగామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశామన్నారు. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని జగన్ మండిపడ్డారు.

చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుకుంటూ..
‘పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే మేనిఫెస్టోను మంత్రి బొత్స సత్యనారాయణ చూపించారు. అదే బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పాం.
నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను అన్నది ఇప్పుడు కూడా టెలికాస్ట్ చేయిస్తా.
మేనిఫెస్టోలో ఏం చెప్పామన్న దాంట్లో ఒక లైన్ తీసేయిస్తాడు. ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు' అని చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేనిఫెస్టోలో ఏం రాశామన్నది కూడా చదివి వినిపిస్తాను అంటూ సీఎం.. చదివి వినిపించారు.

చంద్రబాబు కళ్లకు గుడ్డి వచ్చిందా?
‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగుకు రూ.2 వేలకు అమ్మారు. అందులో 3 లక్షల రూపాయలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుని, 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు. మరి చంద్రబాబు కళ్లకు గుడ్డి వచ్చిందా? కళ్లు కనిపించడం లేదా? 300 అడుగులు అన్నది ఆయనకు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. ఈ మనిషికి సమస్య ఏంటి? అని ప్రశ్నించారు.

చంద్రబాబు పార్టీకి వచ్చే ఎన్నికల్లో 2,3 సీట్లు కూడా రావు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడతోపాటు విపక్ష సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగించడంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రజలకు చేరవద్దనే కుట్రతోనే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర అంశాలపై రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా రావని జగన్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications