జల్సాలు, ప్రేయసికి బహుమతులు: అప్పుల పాలై ఆ క్యాడ్ ఇంజనీర్ ఏం చేశాడంటే..
ప్రేయసికి బహుమతులు కొనిస్తూ, ఆమెతో విలాసాలకు మరిగి ఓ సీనియర్ క్యాడ్ ఇంజనీర్ అప్పుల పాలయ్యాడు. దాంతో అతను చేసింది వింటే ఆశ్చర్యపోతారు...
విశాఖ: జల్సాలు చేస్తూ ప్రేయసికి బహుమతులు కొనిస్తూ ఓ సంస్థలో సీనియర్ క్యాడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి అప్పుల పాలై చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. అప్పులను తీర్చేసి ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆశపడి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన గురించి గురువారం విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాంతిభద్రతల డీసీపీ నవీన్ గులాటీ వివరాలు వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం - పోతినమల్లయ్యపాలెంలోని బింద్రానగర్కు చెందిన ముదునూరి సాయివంశీ (26) అలియాస్ రాజు రుషికొండలో ఉన్న క్లోవ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సీనియర్ క్యాడ్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఓ యువతితో ప్రేమవ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఆమెకు నిత్యం అధికమొత్తంలో ఖర్చుపెడుతూ బహమతులు ఇవ్వడం, పార్టీలకు తీసుకెళ్లడం చేసేవారు.
దాంతో నెలకు వచ్చే రూ. 20 వేల వేతనం సరిపడక సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశాడు. అది తీర్చే దారిలేక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసుకున్నాడు. తాను విధులు నిర్వహిస్తోన్న సంస్థ యజమాని ఈ మెయిల్ చిరునామా తెలుసుకుని, ఈ నెల 1న క్లోవ్ టెక్నాలజీ సంస్థలో బాంబులు పెట్టినట్లు సందేశం పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీన్ని తీసేయాలంటే 24 గంటల్లోగా రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
సొమ్ము ఎక్కడికి తేవాలో తర్వాత చెబుతానని మద్దిలపాలెంలోని అంతర్జాల కేంద్రం నుంచి సందేశం పంపించాడని పోలీసులు గుర్తించారు. సంబంధిత సంస్థ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి ఈ నెల 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకూ బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు.
అయితే, పోలీసులకు ఎలాంటి బాంబు తమకు దొరకలేదు.. దర్యాప్తు నిమిత్తం నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం అంగీకరించాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని గులాటీ వివరించారు.