Amaravati: జగన్ సర్కార్పై జాతీయ మీడియా జర్నలిస్టుల ఫైర్.. త్వరలో అమరావతిలో బస్సు యాత్ర?
అమరావతి: జాతీయ స్థాయి మీడియా సంస్థలకు చెందిన కొందరు ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు త్వరలో రాజధాని అమరావతి ప్రాంతంలో బస్సు యాత్రను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా దీనికి సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి తమ వ్యవసాయ భూములను ఇచ్చిన రైతులను వారు ముఖాముఖిగా కలుస్తారని అంటున్నారు. రైతులు, స్థానికుల అభిప్రాయాలను దేశం మొత్తానికీ వినిపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
డబుల్ కెఫీన్ లో 20 కప్పుల కాఫీ..
అమరావతి సహా రాష్ట్రంలో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేస్తామనే వైఎస్ జగన్ నిర్ణయాన్ని శేఖర్ గుప్తా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం.. ఈ దశాబ్దం మొత్తానికే అతి పెద్ద అతి పెద్ద విషాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. తుగ్లక్ డబుల్ కెఫీన్ లో 20 కప్పుల కాఫీ తాగి తీసుకున్న నిర్ణయంలా ఉందని శేఖర్ గుప్తా ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ స్థానంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే అమరావతి మరింత గొప్పగా నిర్మాణం చేసేవారని చెప్పుకొచ్చారు.
శేఖర్ గుప్తాకు మద్దతుగా చంద్రబాబు..
తన వ్యాఖ్యానాలతో కూడిన వీడియోను శేఖర్ గుప్తా ట్వీట్ చేయగా.. దాన్ని ప్రమోట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీన్ని రీట్వీట్ చేశారు. ఆ వీడియో వెలువడిన రోజే సాయంత్రం విలేకరుల సమావేశంలో సైతం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో శేఖర్ గుప్తా అత్యుత్తమ జర్నలిస్టు అని, అద్భుత విశ్లేషకుడని, అలాంటి వ్యక్తే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా..
తాజాగా జాతీయ మీడియా జర్నలిస్టులు అమరావతిలో నిర్వహించాలనుకుంటున్న బస్సు యాత్రకు తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు పార్టీ సీనియర్లకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అమరావతి పరిధిలోని ప్రతి గ్రామంలోనూ జాతీయ మీడియ జర్నలిస్టుల బస్సు యాత్ర కొనసాగేలా రోడ్ మ్యాప్ కు టీడీపీ నాయకులే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.
నిర్ణయం వాయిదా వెనుక..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడం, ఆ వెంటనే అమరావతి ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులకు దిగడం, వారి ఆందోళనలకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన దిశా నిర్దేశం చేస్తుండటం చకచకా సాగిపోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో విజయవాడను పరిపాలనా పరమైన రాజధానిగా ప్రకటించే విషయంలో వైఎస్ జగన్ ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదు. వ్యూహాత్మకంగానే వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు.