ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయండి: వెంకటసుబ్బారెడ్డి
విశాఖపట్నం: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రాయలసీమ చిచ్చు ప్రారంభమవుతోంది. ప్రస్తుత రాయలసీమ ప్రాంతంతో పాటు గతంలో ఈ ప్రాంతంతో కలిసి ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలతో కలిసి 2018 డిసెంబర్ నాటికి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి డిమాండ్ చేశింది.
వరుస ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని సమితి అధ్యక్షుడు కె. వెంకట సుబ్బారెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

రాయలసీమలోని ప్రస్తుత జిల్లాలతో కృష్ణగిరి, రాయవెల్లూరు, బళ్లారి, రాయచూర్ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సంస్థ కార్యకర్తలు ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకుని వెళ్తారని ఆయన చెప్పారు.
రాయలసీమ ప్రాంతానికి పది లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందు కృష్ణా నదిపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యం మరింత పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications